హైదరాబాద్ : మునుగోడు టీఆర్ఎస్లో అసంతృప్తులు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలువబోతున్నారని తెలిపారు. ఇవాళ్టి నుంచి ఉప ఎన్నిక ముగిసే వరకు విశ్రమించేది లేదని మంత్రి తేల్చిచెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
మునుగోడు నియోజవర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశం అనంతరం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మునుగోడు టీఆర్ఎస్ నేతలతో సమావేశం జరిపామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశమై చర్చించామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తాం. ఉప ఎన్నికలో టీఆర్ఎస్నే గెలిపిస్తమని ప్రజలు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన వారిని ప్రజలు ఎండగట్టాలన్నారు. కేసీఆర్ నాయకత్వానికి ప్రజల్లో ఎనలేని ఆదరణ ఉందన్నారు. ఫ్లోరోసిస్ను నల్లగొండ జిల్లా నుంచి సీఎం కేసీఆర్ తరిమికొట్టారు. ఫ్లోరోసిస్ను అరికట్టేందుకే మిషన్ భగీరథను తీసుకొచ్చారు.
సొంత పార్టీపై మాట్లాడి సంచలన ప్రకటనలు చేయడం తప్ప రాజగోపాల్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. మునుగోడును అభివృద్ధి చేయడంలో రాజగోపాల్ రెడ్డి విఫలమయ్యారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం మాత్రమే ఈ ఉప ఎన్నిక వస్తుందన్నారు. 2023 వరకు కాకుండా రాజగోపాల్ రెడ్డిని ముందుగానే ఇంటికి పంపే అవకాశం వచ్చిందని ప్రజలు భావిస్తున్నారని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తామంతా ఐక్యంగా ఉన్నామని, సీఎం ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలిపిస్తామని తేల్చిచెప్పారు. ఇవాళ్టి నుంచి ఉప ఎన్నికలో గెలిచే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.