హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలపై చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలోని ఏడు మండాలలు, సీలేరు పవర్ ప్రాజెక్టులను ఏపీకి అప్పగించారు. ఐటీఐఆర్ ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. ఇట్ల అనేక రకాలుగా కేంద్రం ఇబ్బంది పెట్టింది. కానీ ఓపికకు హద్దు ఉంటుంది.
నరేంద్ర మోదీని సూటిగా ఒక మాట అడుగుతున్నాను. ఈ సభలో కూడా మీ సీఐడీలు ఉన్నారు. ఆవిషయం నాకు తెలుసు. పావు గంటలో మీ టేబుల్ మీదకు నా మాటలు వస్తాయి. చేతులు జోడించి అడుగుతున్నాను. మీరు వడ్లు కొంటరా.. కొనరా.. అనేది స్పష్టం చేయాలి. 50 రోజులు గడచినిప్పటికీ ఉలుకుపలుకు లేదు. సమాధానం లేదు. వడ్లు కొనేతట్టు లేరని యాసంగిలో వరి వేయొద్దని చెబితే.. బీజేపీ నాయకులు వితండవాదం చేస్తున్నారు. బీజేపీ నాయకులు రాజకీయ నాటకాలు ఆడుతున్నారు. అవసరమే అనుకుంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితి భారత రైతాంగ సమస్యల కోసం నాయకత్వం వహిస్తాం. బీజేపీ మెడలు వంచుతాం. రైతు వ్యతిరేక చట్టాలపై చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.