హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ‘అందరికీ ఇల్లు’ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లను మోడల్గా స్వీకరించాలని టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వర్రావు సూచించారు.మంగళవారం లోక్సభలో బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశంలో నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో ఉన్నదని, పత్తిపై దిగుమతి సుంకాన్ని 10-15 శాతం పెంచటం ద్వారా రైతులకు న్యాయం జరిగినట్టేనని పేర్కొన్నారు. కేంద్రం ప్రారంభించే మెగాటెక్స్టైల్స్ పార్కుల జాబితాలో వరంగల్లోని కాకతీయ మెగాటెక్స్టైల్ పార్క్, సిరిసిల్ల టెక్స్టైల్ క్లస్టర్ను చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఎకనమిక్ కారిడార్లో చేర్చాలని, హైదరాబాద్ మెట్రోరైల్కు నిధులు ఇవ్వాలని కోరారు. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రెండింతలు మెరుగ్గా ఉన్నదని వివరించారు. దేశవ్యాప్తంగా 20 శాతం ఐటీ ఎగుమతులు ఉంటే, హైదరాబాద్ నుంచే 17 శాతం ఉన్నాయని ఉదహరించారు. పంచాయతీలను బలోపేతం చేయటంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదని పేర్కొన్నారు.
గొర్రెల శిక్షణా కేంద్రం ఏర్పాటుచేయండి :ఎంపీ రంజిత్రెడ్డి
గొర్రెల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులపై అవగాహన లేకపోవడం వల్ల ఆ వృత్తిదారులు ఆర్థికంగా నష్టపోతున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని గొర్రెల పెంపకం శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తున్నదని, గొర్రెల పెంపకంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకం శిక్షణా సంస్థను ఏర్పాటుచేయడం ద్వారా దాదాపు 5 లక్షల కుటుంబాలకు ఉపయోగపడుతుందని సూచించారు.