SCR | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ఎండకాలం దృష్ట్యా ఏప్రిల్, మేలో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో దాదాపు 1079 ప్రత్యేక రైళ్ల (ట్రిప్పులు)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలోనూ దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా 9,111 ట్రిప్పు లు నడుపుతున్నామని, 2023లో 6,369 ట్రిప్పులు నడిపితే ఈ సారి 2,742 ట్రిప్పులు అదనమని పేర్కొన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే ట్రాక్ పునరుద్ధరణలో దక్షిణ మధ్య రైల్వే జోన్ నెట్వర్క్ రికార్డు సృష్టించినట్లు అధికారులు వెల్లడించారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 649 కిలోమీటర్ల మేర ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేశామని, 2022-23లో 448 కిలోమీటర్ల మేర పునరుద్ధరణ కాగా ఈ సారి 45 శాతం అధికంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి జూన్ 15 వరకు ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. మైసూర్-ముజఫర్పూర్, బెంగళూరు-మాల్దాటౌన్, బెంగళూరు-బీదర్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు.