హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కొంటరా? కొనరా స్పష్టం చేయాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మరోమారు కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని విమర్శించారు. రైతుల సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు వరుసగా ఐదోరోజు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు కాగితాలు చించివేసి ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. రైతుల కోసం ఐదురోజులుగా ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలకు తొమ్మిది పార్టీల ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి స్పీకర్ చొరవ చూపాలని కోరారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని సంబంధిత పార్టీ సభ్యులను పిలిపించి చర్చించాలని సూచించారు. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావును తన చాంబర్కు పిలిపించుకొని మాట్లాడారు. సభ ముగిసిన అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
పార్లమెంట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కాగానే ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు రైతుల సమస్యలపై ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై చర్చను డిమాండ్ చేస్తూ ఇటు రాజ్యసభలో టీఆర్ఎస్ పక్షనేత కే కేశవరావు, అటు లోక్సభలో పార్టీ నేత నామా నాగేశ్వర్రావు వాయిదా తీర్మానాలను అందించారు. ఉభయ సభల్లోనూ ఈ తీర్మానాలను స్వీకరించకుండా తిరస్కరించారు. దీంతో రాజ్యసభలో వారు ప్లకార్డులు పట్టుకొని వెల్లోకి దూసుకెళ్లారు. మాట్లాడేందుకు అవకాశమిస్తామని చైర్మన్ వెంకయ్యనాయుడు, స్పీకర్ ఓం బిర్లా హామీ ఇవ్వడంతో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన విరమించారు.
తెలంగాణ రైతులు పండించిన పంటలో కేంద్రం ఎంత కొంటుందో చెప్పాలని కే కేశవరావు డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందా? లేదా? అని సూటిగా ప్రశ్నించారు. గత సంవత్సరం 94.54 శాతం కొనుగోలు చేశామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆ మేరకు కొంటుందా? లేదా అని నిలదీశారు. పండిన పంటను మొత్తం కొనాలన్నదే తమ అభిమతమని, ఇందులో ఎటువంటి వివాదం లేదని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర మంత్రి పీయూష్గోయల్ సమాధానం ఇస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలతో కేంద్రం చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొనుగోళ్లు సాగుతున్నాయని చెప్పారు. పంటల విస్తీర్ణానికి అనుగుణంగా కొనుగోళ్ల విధానం ఉండాలని కేకే డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం రైతులతో చెలగాటం ఆడుతున్నదని కేశవరావు మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. సభ వాయిదా పడిన అనంతరం ఆయన తెలంగాణ భవన్లో పార్టీ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బాయిల్డ్ రైస్ కొనే విషయంలో కేంద్రం సూటిగా సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. తమను ‘రాజకీయాలు చేస్తున్నారు’ అనడాన్ని ఆక్షేపించారు. రాజకీయాలు చేస్తున్నది తాము కాదని, కావాలనే బీజేపీ ప్రభుత్వంగా రాజకీయం చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గతంలో తీసుకున్నట్టే తీసుకుంటామని నోటి మాటతో చెబుతున్నారే కానీ అసలు విషయాన్ని దాచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
లోక్సభలో టీఆర్ఎస్పక్ష నేత నామా నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టత ఇవ్వటం లేదని మండిపడ్డారు. సంవత్సరానికి ఏ రాష్ట్రం నుంచి ఎంత కొంటారు? అనే అంశాన్ని తేలిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటాయని చెప్పారు. కేంద్రం ఏమీ తేల్చకుండా రైతుల్ని గందరగోళానికి గురిచేయటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నంపెట్టే అన్నదాతను ఆగం చేస్తే దేశానికి మంచిది కాదన్నారు. రాజ్యాంగబద్ధంగా పంట కొనుగోళ్ల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్న విషయాన్ని కేంద్రం విస్మరిస్తున్నదని చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఎంపీలు కాగితాలను చించివేసి వాకౌట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం రైల్వేను, పోర్టులను అమ్మేసినట్టే ఎఫ్సీఐని కూడా అమ్మే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నదని నామా నాగేశ్వర్రావు అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యాన్ని తరలించేందుకు రైల్వే రేక్స్ ఇవ్వకుండా, ఎఫ్సీఐ గోదాములను ఖాళీ చేయకుండా కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తమ చెప్పుచేతల్లో ఉన్న సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని రాష్ర్టాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నదన్నారు.
రైతుల కోసం ఐదు రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటానికి తొమ్మిది పార్టీలు సంఘీభావం తెలిపాయి. టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న డిమాండ్ను పరిష్కరించకుండా ఎందుకు నాన్చుతున్నారని ఆయా పార్టీల ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలు బందోపాధ్యాయ, కల్యాణ్బెనర్జీ, కాంగ్రెస్ నేత అధీర్రంజన్ చౌదరి, శివసేన పార్టీ నేత వినాయక్రావత్, బీజేడీ నేత పినాకినీ మిశ్రా, బీఎస్పీ నేత రితీశఖ పాండే, జేడీయూ, సీపీఎం, ఎస్పీ సభ్యులు టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతు పలికారు. ఒడిశా, తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు స్పీకర్ చొరవ చూపాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని సంబంధిత పార్టీ సభ్యులను పిలిపించి చర్చించాలని వారు సూచించారు.
టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావును స్పీకర్ ఓం బిర్లా తన చాంబర్కు పిలిపించి వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఆధారాలతో సహా నామా స్పీకర్కు వివరించినట్టు సమాచారం.
నేడు ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్లో టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సి వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నదని మరో సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాగులెక్కలు సరిగా లేవని చెప్పి ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం నాలిక కరుచుకున్నదని తెలిపారు. రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం విషయంలో రాష్ట్రం సమర్పించిన లెక్క 99.99శాతం నిజమేనని తేలిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘తమవద్ద సరిపోయినంత స్టాకు ఉన్నందున బాయిల్డ్ రైస్ కొనబోమని మంత్రి (పీయూష్ గోయల్) చెప్తున్నారు. తెలంగాణకు చెందిన మరో కేంద్ర మంత్రి (కిషన్రెడ్డి) మాత్రం ప్రతి ధాన్యపు గింజ కొంటామని అంటున్నారు. మీ వద్ద ధాన్యపు నిల్వలకు సంబంధించిన రికార్డు, బాయిల్డ్ రైస్కు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. దేశంలో రెండేండ్లకు సరిపోయినంత బాయిల్డ్ రైస్ ఉందని మీరు భావిస్తే అప్పటిదాకా బాయిల్డ్ రైస్ పండించవద్దని రైతులకు స్పష్టంగా చెప్పండి. ఇందుకోసమే మేము ఆందోళన చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఇదే విషయమై అనుబంధ ప్రశ్న వేసేందుకు చైర్మన్ నిరాకరించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
వరి కొనుగోలు అంశంపై కేంద్రం ఏదైనా తేలుస్తుందా అని ఎదురుచూసిన తెలంగాణ రైతులకు కేంద్రం మొండిచేయి చూపిస్తున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం తెలంగాణ రైతులకు బ్లాక్డే అని ఆయన అభివర్ణించారు. చెప్పేవి రాముని మాటలు.. చేసిది రావణ చేష్టలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ధాన్యం కొనగోళ్ల విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వానికి దిమాక్ లేదని ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి మండిపడ్డారు. బాధ్యతగల కేంద్ర మంత్రి పియూష్ గోయల్.. సీఎం కేసీఆర్ను రాజకీయం చేస్తున్నారని పేర్కొనటాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు అక్కడ వరి వేయండని చెప్తూ ఇక్కడ మాత్ర నోరు మెదపని దద్దమ్మలుగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలు మొనగాళ్లే అయితే కేంద్రాన్ని ఒప్పించి రైతులకు న్యాయం చేయాలని ఆయన సవాల్ విసిరారు.