హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నవోదయ చట్టంలో ఉన్నా.. కానీ వాటిని అమలు చేయడంలేదంటూ నిలదీశారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయని, అయితే కేవలం తొమ్మిది నవోదయ విద్యాలయాలు మాత్రమే ఏర్పాటు చేశారని ఎంపీలు కేంద్రానికి గుర్తు చేశారు.
సోమవారం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, మాలోతు కవిత, వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్, గడ్డం రంజిత్ రెడ్డి కొత్త నవోదయాల ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణలో 2014 మే చివరి నాటికి ఉన్న జిల్లాల్లో మాత్రమే జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేశామని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.
కొత్త నవోదయల ఏర్పాటు అనేది నిరంతర ప్రక్రియ అని, నిధుల లభ్యత ఆధారంగా కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయని, వాటిలో 1467 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారని వీటిల్లో 36,731 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. తెలంగాణలోని 35 కేంద్రీయ విద్యాలయాల్లో 26 శాశ్వత భవనాల్లో ఉన్నాయని తెలిపారు. మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు.