హైదరాబాద్ : మోదీ కార్పొరేట్ ఎత్తులు మునుగోడులో చిత్తయ్యాయని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎంపీలు వెంకటేశ్ నేత, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటనేశ్ నేత మాట్లాడుతూ మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్ అండగా నిలిచారన్నారు. ఓడిపోయిన బండి సంజయ్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ న్యాయం కోసం యుద్ధం చేసిందన్నారు. బండి సంజయ్ ఓ అజ్ఞాని అని, డబ్బు పంచి గెలిచారనడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సంఘం కేంద్రం చేతిలో ఉంటుందని బండికి తెలియదా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ను అడ్డుకునేందుకు మోదీ, అమిత్ షా మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని, బీజేపీ ఓ డ్రామా కంపెనీలా తయారైందని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేసి మునుగోడులో గెలవాలని చూశారని, ఓటర్లు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టారన్నారు. రూ.18వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఉప ఎన్నిక వచ్చిందని, రాజీనామా చేస్తేనే కాంట్రాక్టు ఇస్తామని మోదీ, అమిత్షా రాజగోపాల్ను బెదిరించారన్నారు. రాజ్యాంగ బద్ధంగానే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకోలేదని, బీజేపీ పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను మార్చిందన్నారు.
బట్టేబాజ్ బీజేపీ పార్టీ ప్రభుత్వాలను మార్చేందుకు కోట్ల రూపాయాలను వెచ్చించిందని, అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, సిక్కింలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు నీతి, జాతి లేని రాజకీయాలు లేదా? అని నిలదీశారు. బండి సంజయ్ ఇప్పటికైనా జ్ఞానం పెంచుకోవాలని, బీజేపీ నేత వివేవ్ అవివేకి, సిగ్గులేని దద్దమ్మ అని మండిపడ్డారు. కేటీఆర్ను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్గా దొరికి పోయిన దొంగల పార్టీ బీజేపీ అని, ఆ పార్టీకి తెలంగాణ లో స్థానం లేదన్నారు. బీఆర్ఎస్కు దేశమంతటా ఆదరణ లభిస్తోందన్నారు. మునుగోడు తీర్పు బీఆర్ఎస్ బలోపేతానికి బాటలు వేసిందన్నారు.
బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడడం తగ్గించుకోవాలని ఎంపీ మాలోత్ కవిత సూచించారు. మునుగోడులో
తెలంగాణ ధర్మాన్ని ప్రజలు నిలబెట్టారని, పరీక్షా సమయంలో తెలంగాణ వైపు నిలబడ్డ మునుగోడు ఓటర్లకు
పాదభివందనాలు తెలుపుతున్నానన్నారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కూడా గెలిచింది.. అక్కడ కూడా అధికార దుర్వినియోగం చేసి గెలిచారా ..? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో అట్టర్ ప్లాప్ నేత వివేక్ అని విమర్శించారు. ఆయనకు కేటీఆర్ను విమర్శించే హక్కు లేదన్నారు. హుజూరాబాద్కు వివేక్ డబ్బులే వెళ్లాయని, మునుగోడుకు వివేక్ డబ్బులే వెళ్లాయన్నారు. వివేక్ డబ్బు రాజకీయాలను మునుగోడు ప్రజలు తిస్కరించారని, తెలంగాణలో బీజేపీకి ఆదరణ ఉండదని ప్రజలు తేల్చారన్నారు. మతోన్మాద శక్తులకు మునుగోడు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. మునుగోడు మా సీటు కాకున్నా గెలిచి చూపించామని, ఇప్పటికైనా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని, లేకుంటే ప్రజలు తరిమికొడుతారని హెచ్చరించారు.
తెలంగాణ మోడల్ దేశానికి కావాలని మునుగోడు ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదించారని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఉపఎన్నిక తెచ్చిన బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పారన్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ప్రయత్నించిన బీజేపీకి మునుగోడులో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, మిత్రపక్షాలే గెలుస్తాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేసినట్టు బీజేపీ తెలంగాణలో చేస్తే కుదరదు అని, కారును పోలిన గుర్తులు లేక పోతే టీఆర్ఎస్ మెజారిటీ ఇంకా పెరిగేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి పనికొచ్చే పనులను బీజేపీ చేసే మంచిదని, బీజేపీ మాయమాటలకు తెలంగాణలో స్థానం లేదని స్పష్టం చేశారు.