వాషింగ్టన్, జూలై 12 : పశ్చిమాసియా మరోసారి బాంబు పేలుళ్లు, క్షిపణి దాడులతో దద్దరిల్లింది. హొర్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై దాడి చేసిందన్న ఆరోపణపై ఆదివారం తెల్లవారుజామున ఇరాన్పై అమెరికా మరోసారి దాడికి దిగింది. ఇరాన్ చేసిన దాడిలో ఆ నౌకకు నిప్పంటుకోవడంతో దానిలోని సిబ్బంది నౌకను విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. అమెరికా చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్.. గల్ఫ్లోని పలు దేశాలు లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఒమన్లపై దాడులకు దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేందుకు జరుగుతున్న శాంతి ప్రయత్నాలపై తాజాగా జరుగుతున్న పోరాటం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నది. ఇక ఈ రెండు దేశాల మధ్య శాంత కల్లేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో జరిపిన రెండు దాడుల కన్నా తీవ్రంగా ఆదివారం ఇరాన్లోని 140కు పైగా క్షిపణి, డ్రోన్ కేంద్రాలు, ఆయుధాగారాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర ప్రాంతాలపై లక్షిత దాడులు చేసినట్టు ఆమెరికా ప్రకటించింది. ‘ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అది మూల్యం చెల్లిస్తున్నది’ అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆన్లైన్లో పోస్ట్ పెట్టారు. తాము మాత్రమే హొర్ముజ్ జలసంధిని నియంత్రించగలమని, దాని ద్వారా పయనించే నౌకలపై చార్జీలు విధించగలమని ఇరాన్ స్పష్టం చేసింది. ఏకపక్ష ఒప్పందాల శకం ముగిసిందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ బాఘెర్ ఘాలిబాఫ్ ఆదివారం ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, ఇరాన్ క్షిపణులను తాము సమర్థంగా అడ్డుకున్నట్టు ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా క్షిపణి శకలాలు పడి ఒక పిల్లవాడు సహా ముగ్గురు పౌరులు గాయపడ్డట్టు తెలిపింది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను తాము కూడా అడ్డుకున్నట్టు కువైట్ మిలిటరీ ప్రకటించింది. ఆదివారం బహ్రెయిన్లో పౌరులకు మూడుసార్లు హెచ్చరిక సైరన్లు మోగాయి.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఎట్టకేలకు ప్రజల ముందుకు రాబోతున్నారు. తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ స్మారకార్థం మంగళవారం టెహ్రాన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
మస్కట్ : హొర్ముజ్ జలసంధిలో వాణిజ్యనౌకపై ఇరాన్ దాడి చేయగా ఒక భారతీయుడు గల్లంతయ్యాడు. జీఎఫ్ఎస్ గెలాక్సీ అనే సైప్రస్ జెండా కలిగిన వాణిజ్య నౌకపై ఒమన్ తీరంలో ఆదివారం ఇరాన్ దాడి చేసింది. ఈ దాడి జరిగిన వెంటనే నౌక ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో 11 మంది ఉండగా.. 10 మందిని ఒమన్ సహాయక బృందాలు కాపాడాయి. ఇంకొకరు గల్లంతయినట్టు భారత ప్రభుత్వం ధృవీకరించింది.. ఇరాన్ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు విదేశాంగ శాఖ చెప్పింది.
అనుమతి లేని మార్గంలో జీఎఫ్ఎస్ ప్రయాణించిందనే కారణంతోనే దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. ఇండియన్ నౌకలపై దాడులు ఆందోళనకరంగా ఉన్నాయని.. దాడులను ఆపాలని భారత్ తెలిపింది.