సిటీబ్యూరో, జులై 12 (నమస్తే తెలంగాణ): ఆరు ప్రాణాలు బలితీసుకున్న నరహంతకుడి కేసులో పోలీసుల నిర్లక్ష్యం, అవినీతిపై ఉన్నతాధికారులు కంటితుడుపు చర్యలతోనే సరిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పోక్సో కేసులో నిందితుడైన రాజ్కుమార్ను అరెస్ట్ చేసేందుకు అవకాశాలున్నా, అరెస్ట్ చేయకుండా అమ్యామ్యాలకు లాలూచిపడి ముందస్తు బెయిల్ పొందేందుకు పరోక్షంగా పోలీసులు సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. నిందితుడితో తమకు ప్రాణ భయం ఉందంటూ పోలీసులకు మొరపెట్టుకున్నా కనీసం పోలీసులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
దీంతో తమపై కేసు పెట్టారనే పగతో రగిలిపోయిన హంతకుడు రాజ్కుమార్ పోక్సో కేసు పెట్టిన బాధిత కుటుంబాన్ని, ప్రశ్నించినందుకు తన కుటుంబాన్ని మట్టుబెట్టాడు. ఇందు లో పోలీసుల నిర్లక్ష్యం, అవినీతి ఉందంటూ షాబాద్లో శనివారం స్థానిక ప్రజలు ఆందోళనకు దిగడంతో ప్యూచర్సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి షాబాద్ ఎస్సై రమేష్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు, అలాగే సీఐపై శాఖపరమైన చర్యలుంటాయని వెల్లడించారు. అయితే ఎస్సై సస్పెన్షన్తోనే ఈ విషయాన్ని అధికారులు పక్కన పెట్టేశారనే విమర్శలు వస్తున్నాయి. శనివారం ప్రజలు ఆగ్రహంతో ఉండడంతో వారిని సముదాయించే క్రమంలో ఎస్సైపై తప్పని పరిస్థితులలో చర్యలు తీసుకొని పరిస్థితిని చక్కదిద్దారని, ఆ తరువాత ఆ విషయాన్ని ఉన్నతాధికారులు పక్క న పెట్టేశారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
షాబాద్ పోలీస్స్టేషన్కు ఎస్హెచ్ఓగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో సిబ్బంది పనిచేస్తుంటారు. ఆయనపై ఏసీపీ, డీసీపీలు, ఇతర ఉన్నతాధికారులు ఉంటారు. నిందితుడి వద్ద నుంచి భారీగా లంచాలు తీసుకొని పరోక్షంగా అరెస్ట్ చేయకుండా, ముందస్తు బెయిల్ పొందేందుకు కావాల్సినంత సమయాన్ని పోలీసులు ఇచ్చారనే బాధిత బంధువులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్లక్ష్యం, అవినీతి అక్రమాలలో ఉన్నతాధికారుల పాత్రపై చర్యలు లేకపోవడంతో బాధితులు మండిపడుతున్నారు. నరహంతకుడి వ్యవహారశైలిపై బాధితులు పోలీసుల వద్ద మొరపెట్టుకున్నా కనీస చర్యలు చేపట్టని పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సాధారణ ప్రజలు సైతం అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఒక కేసులో ఉన్న నిందితుడు ఉన్మాదిగా మారి తన భార్య, పిల్లలతో పాటు తనపై ఫిర్యాదు చేసిన కుటుంబాన్ని హతమార్చేంత వరకు వచ్చాడంటే అతడికి భయం లేకపోవడంతోనే ఇది జరిగిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచాలు ఇవ్వడంతోనే పోలీసులంటే ఆ భయం పోయిందని, దీనిని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకోవాల్సింది పోయి.. నామ మాత్రపు చర్యలతో వదిలేయడం ఏంటనీ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పోక్సో కేసులో నిందితుడికి పోలీసులకు మధ్య అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్సైని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు, ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నా… వారిపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పోక్సో కేసులో నిందితుడి వద్ద లంచాలు తీసుకొని, వాటాలు పంచుకున్న వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు శనివారం నిర్వహించిన ఆందోళన సందర్భంగా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎస్సైపై తీసుకున్న చర్యలతోనే పుల్స్టాప్ పెడుతారా? అంతర్గతంగా దర్యాప్తు చేసి, సంబంధమున్న మిగతా వారిపై చర్యలు తీసుకుంటారా? రాజకీయ ఒత్తిళతో నిర్లక్ష్యం, అవినీతిపై వంటి వాటిపై దర్యాప్తు, చర్యలను ఇంతటితోనే వదిలేస్తారా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే ఇంకా కొద్ది సమయం వేచి చూడాల్సిందని డిపార్టుమెంట్లో చర్చ జరుగుతున్నది.