పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ రంజిత్రెడ్డి
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏమైనా ఉన్నాయా? అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నించారు.
గురువారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మైనార్టీలకు గత ఐదేండ్లలో కేంద్రం కేటాయించిన, విడుదల చేసిన నిధుల వివరాలను వెల్లడించాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ.. మైనార్టీల సంక్షేమానికి రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నదని, వీటిద్వారా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 2017-22 మధ్యకాలంలో తెలంగాణకు వివిధ పథకాల కింద రూ.805.65 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు.