హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కాంట్రాక్టులు, కమీషన్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం, రాజగోపాల్రెడ్డి ఏ పార్టీలో చేరినా తమకు అభ్యంతరం లేదని, సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్రెడ్డి మూడున్నరేండ్లుగా మునుగోడు నియోజకవర్గాన్ని ఎన్నిసార్లు సందర్శించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి, బీజేపీతోనే అభివృద్ధి అంటూ మైండ్గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు.
అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోని నాయకుడు ఏ పార్టీలో ఉంటే ప్రజలకు ఏమి లాభమని ఎద్దేవా చేశారు. కనీసం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసేందుకు కూడా రాజగోపాల్రెడ్డి నియోజకవర్గానికి రాకపోతే.. మంత్రి జగదీశ్రెడ్డి, తాను కలిసి వాటిని లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. అన్న ఎంపీగా, తమ్ముడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్కు కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. మునుగోడు నుంచి ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. కోమటిరెడ్డి చేసిన మేలు ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు.