హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బేగంపేటలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణపై మరోసారి విషం కక్కారని నిప్పులు చెరిగారు. ప్రధాని హోదాలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఒక్క సంస్థను ఇవ్వకుండా అన్యాయం చేశారని కోపోద్రిక్తులయ్యారు. మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్ ఎందుకు ఇవ్వలేదని మోదీని పల్లా ప్రశ్నించారు. తెలంగాణకు కేటాయించిన ఐటీఐఆర్ను రద్దు చేసిన చరిత్ర మోదీ ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏడు మండలాలను ఏపీలో కలిపి ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేయడం సరికాదన్నారు. రూ. లక్షల కోట్ల అప్పులు చేసి దేశ ప్రజలపై భారం మోపుతున్నారని పల్లా పేర్కొన్నారు. వృద్ధిలో , తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను తెలంగాణ సాకుతోందన్నారు.
మూఢ నమ్మకంతోనే పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తున్నారా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నూతన రాష్ట్రం కనుక.. అవసరాలకు అనుగుణంగా కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తున్నామని తెలిపారు. అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.