హైదరాబాద్ : వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటన చేయడం, ఈ దేశ రైతుల విజయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుల్లెట్లకు, లాఠీలకు, పోలీసు కంచెలకు రైతులు ఎదురెళ్లి ఏడాది పాటు తమ నిరసనను వ్యక్తం చేశారని, అంతిమంగా రైతులే విజయం సాధించారని తెలిపారు. అన్యాయానికి వ్యతిరేకంగా విజయం సాధించిన రైతులకు ఆయన అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట సంకేతం… సాగు చట్టాల రద్దుకు ఒక కారణం అని ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలలో రైతు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రమాదముందని గ్రహించిన కేంద్రం వెనక్కు తగ్గి వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందన్నారు. ఉద్యమంలో అసువులు బాసిన రైతుల త్యాగాలను కొనియాడారు. రైతుల పోరాటానికి ముందే కేంద్ర నిర్ణయం తీసుకుంటే బాగుండేందని అన్నారు. సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పండించే మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేయాలని, అదే విధంగా వచ్చే యాసంగిలో రాష్ట్రంలో వరి పండించడానికి అనుమతి ఇవ్వాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు.