హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. బండి పాదయాత్ర వైపు ప్రజలు కన్నెత్తి కూడా చూడటం లేదని, బీజేపీ కార్యకర్తలే హడావుడి చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కాలే యాదయ్యతో కలిసి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఏడున్నరేండ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని బండి సంజయ్.. మత విద్వేషాలను రగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని మహేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో వెల్లివిరుస్తున్న మతసామరస్యాన్ని చెడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. బండి సంజయ్ పాదయాత్రతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పావలాకు కూడా పనికి రాని యాత్ర అని ఎద్దెవా చేశారు. తెలంగాణకు స్వయం పాలన కావాలి. కానీ గుజరాత్ పటేల్ పాలన వద్దు అన్నారు. తమది అవినీతి పాలన కాదు.. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.