జగిత్యాల : తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజక వర్గం రాయికల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు.
టీఆర్ఎస్ పార్టీ అంటే మన రికార్డులు మనమే తిరగరాసుకునేవాళ్లం. మనం వేరే వాళ్ల రికార్డులు బద్దలుకొట్టుడు కాదు అని కవిత పేర్కొన్నారు. మన లక్ష్యం ఒక్కటే ఉండాలి. గులాబీ కండువా అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారు. గులాబీ జెండా ఎగిరే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. అందుకో సం 24 గంటలు కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. గతంలో మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఒకప్పుడు రాయికల్ వలసల మండలంగా ఉండే. ఇప్పుడు పంటలమయం అయిపోయింది. కాంగ్రెస్ హయాంలో కేవలం 20 వేల ఎకరాల్లో వరి సాగు జరిగేది. కేసీఆర్ సీఎం అయ్యాక 65 వేల ఎకరాల్లో వరి పంట సాగు జరుగుతుంది. రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసిందని కవిత తెలిపారు.
మన నాయకుడు కేసీఆర్ అన్ని వర్గాల గురించి ఆలోచిస్తున్నారు. గత పాలకులు బీడీ కార్మికుల ఓట్లు అడిగారు కానీ పెన్షన్లు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఒక్క రాయికల్ మండలంలోనే 16700 మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నాం. చేసిన పనిని చెప్పాలి. చేయాల్సిన పనిని బాధ్యతతో చేయించాలని కార్యకర్తలకు కవిత సూచించారు.
మన సీఎం మోదీ వస్తున్నాడని ముఖం చాటేశారని జీవన్ రెడ్డి అంటున్నాడు. మరి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటూ తెలంగాణకు వచ్చిండు. ఆయన ఎప్పుడైతే తెలంగాణకు వచ్చిండో.. మునుగోడు ప్రజలకు కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేశాడు. మా నాయకుడు ఎప్పుడూ కూడా ముఖం చాటేయలేదు. ముఖం చాటేసేది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాత్రమే. అనుకున్న లక్ష్యం సాధించే వరకు నిలబడే నాయకుడే నిజమైన నాయకుడు అని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏనాడూ కూడా విశ్వాసం కోల్పోలేదు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్గా ఉందన్నారు. ఇవాళ దేశ వ్యాప్తంగా విప్లవం సృష్టించాలని బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టిస్తదని విశ్వాసం ఉందన్నారు.
కేసీఆర్ను ఏదో ఒకటి అని జీవన్ రెడ్డి వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. జీవన్ రెడ్డి మంత్రిగా ఉండి రోళ్లవాగు ప్రాజెక్టు ప్రస్తావన తీసుకురాలేదు. కానీ రూ. 135 కోట్లతో రోళ్లవాగును నిర్మాణం చేసుకుంటున్నాం. అనేక మోసాలు చేసి అభివృద్ధికి అడ్డుపడ్డది జీవన్ రెడ్డినే. ముఖం చాటేసింది ఆయనే. టీఆర్ఎస్ పాలన పారదర్శకంగా కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.