హైదరాబాద్ : రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం, శాంతియుత వాతావరణం వల్ల భారీ పెట్టుబడులు వస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీ రంగాల్లో జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనబడుతోందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి రంగంలోనూ గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నాం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగాల ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. ఐటీ పాలసీ, ఇండస్ట్రీయల్ పాలసీ టీఎస్ఐపాస్ ద్వారా అనేక పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయి. దీంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. మన పాలసీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రతి సంవత్సరం కూడా టాప్లోనే ఉన్నామన్నారు. ఐటీ, పరిశ్రమల రంగం జిల్లాలకు కూడా విస్తరించాయన్నారు.
వారం పదిరోజుల క్రితం కేరళకు చెందిన కిటెక్స్ గ్రూప్.. తెలంగాణలో రూ. 2400 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా 40 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మలబార్ గోల్డ్ రూ. 750 కోట్ల పెట్టుబడులు పెడుతామని ప్రకటించింది. రాష్ట్రం ఏర్పడిన తొలిరోజుల్లో పెట్టుబడులపై అనేక అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు పెట్టుబడులు తరలిరావడం రాష్ట్రానికి గర్వకారణంగా ఉందన్నారు. సింగపూర్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అనేక అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఐటీ రంగంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో స్టార్టప్లు అద్భుత విజయాలు సాధిస్తున్నాయి.
గత ప్రభుత్వాలు 40 ఏండ్లలో 23 వేల ఎకరాల్లో పరిశ్రమలను నెలకొల్పితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన ఏడేండ్లలో 40 వేల ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. ఐటీ హబ్లను జిల్లాలకు విస్తరిస్తున్నామని తెలిపారు. దేశ జీడీపీకి అత్యధికంగా ఆదాయం సమకూరుస్తున్న అతిపెద్ద నాలుగో రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐటీ పాలసీని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నట్లు ఎమ్మెల్యే వివేకానంద గుర్తు చేశారు.
ప్రత్యేక ప్రసారం