హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీలో సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ కార్యకర్తలను రేవంత్ హింస వైపు ప్రేరేపిస్తున్నారు. రాష్ర్టంలో అల్లకల్లోలం సృష్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ పిల్లి కూతలకు, బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరు అని స్పష్టం చేశారు. సంస్కారం అడ్డు రావడంతో.. రేవంత్ ఉపయోగించిన భాషను వాడలేకపోతున్నామన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి బాగోగులు చూసుకుంటూ సేవా రాజకీయాలు చేస్తున్నామని తెలిపారు.
ఎంపీగా గెలిచిన తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కరోజైనా పర్యటించావా? అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. కరోనాకు భయపడి ఇంట్లో దాక్కున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. కరోనా బారిన పడిన ప్రజలను ఎనాడైనా చేరదీశావా? సేవా చేయాల్సింది పోయి.. రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజా సమస్యలపై పోరాడితే మంచిదన్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరినప్పుడు రేవంత్ రెడ్డి స్పీకర్కు ఎందుకు రాజీనామా లేఖ ఇవ్వలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నోరు జారి, దిగజారుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని సుధీర్ రెడ్డి హెచ్చరించారు.