జగిత్యాల : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించినప్పుడే హరిత హారం విజయవంతమైనట్లు అని జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్పష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని గోవిందపల్లె ఆరో వార్డులో నిర్వహించిన హరిత హారం కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి కలిసి పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. హరితహారం విజయవంతం చేయడానికి ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో పాటు పట్టణ వాసుల భాగస్వామ్యం తప్పనిసరి అని పేర్కొన్నారు. హరితహారం లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనానికి పాటుపడాలన్నారు. జగిత్యాల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం పెరిగిందన్నారు. ఆ ప్లాస్టిక్ను మురుగు కాల్వల్లో, రహదారులపై పడేయడంతో.. వాటిని తిని మూగజీవాలు అనారోగ్యానికి గురవుతున్నాయని తెలిపారు. డ్రైనేజీతో కలుషితమవుతున్న మోతె చెరువును ఎమ్మెల్యే పరిశీలించారు. మోతె చెరువును మురుగు రహితంగా మార్చాలని, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ కొలగాని ప్రేమలత సత్యం, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, కమిషనర్ మారుతి ప్రసాద్, ఎమ్మార్వో వెంకటేష్, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.