ఎంబీబీఎస్ విద్యార్థినికి ఎమ్మెల్యే కోనప్ప భరోసా
నమస్తే తెలంగాణ కథనానికి స్పందించిన కోనేరు
పలువురు దాతల నుంచి రూ.10,700 సాయం
కౌటాల, ఫిబ్రవరి 13 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన చాహరే జనార్దన్-రేఖ దంపతుల మూడో కుమార్తె కరిష్మా ఎంబీబీఎస్ చదువుకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భరోసానిచ్చారు. ఆమె నీట్ పరీక్ష రాసి ప్రభుత్వ కోటాలో హైదరాబాద్లోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్-రిసెర్చ్లో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చదువుకు పేదరికం శాపంగా మారింది. ‘చదువుల తల్లికి సాయమందించరూ’ శీర్షికన ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప స్పందించారు. కరిష్మా చదువు పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ మేరకు కాగజ్నగర్లోని తన నివాసంలో కరిష్మాను సన్మానించారు. మారుమూల ప్రాంతమైన గుర్లబోరి నుంచి నీట్లో అర్హత సాధించడం గొప్పవిషయమన్నారు. చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం స్వయంగా కరిష్మాను హైదరాబాద్కు తీసుకెళ్లి అపోలో వైద్య కళాశాలలో చేర్పించి ఫీజు చెల్లిస్తానని చెప్పారు. ప్రభుత్వం తరఫునా సాయమందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. దాతలెవరైనా ఉంటే చాహరే సంధ్య (కరిష్మాకు పెదనాన్న కూతురు)ను 6303492795 నంబర్లో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే పలువురు దాతల నుంచి రూ.10,700 సాయం అందింది.