బీజేపీపై ఎమ్మెల్యే జోగు ఫైర్
ఎదులాపురం, ఫిబ్రవరి 13: ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ చేస్తున్న పోరాటానికి బీజేపీ నాయకులు మద్దతు పలకాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐ లవ్ సీసీఐ’ సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగితే బీజేపీ నాయకులకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభం కావాలనే ఆలోచన వారికి ఉంటే సెల్ఫీ దిగి మోదీకి పంపాలని హితవు పలికారు. సీసీఐపై ఎంపీ సోయం బాపురావు నోరెందుకు మెదపడం లేదని నిలదీశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా సభలో ఏ ఒక్కరోజూ సీసీఐపై మాట్లాడలేదని మండిపడ్డారు. సీసీఐ పునరుద్ధరణ కేంద్రం పరిధిలోకి వస్తుందని, తాము ప్రారంభిస్తామని గతంలో కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్ గంగారం చెప్పారని, ఈ విషయాన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవాలన్నారు. పరిశ్రమను రాష్ర్టానికి అప్పగిస్తే, తాము పునః ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరినా స్పందన లేదన్నారు.