హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అమిత్ షా అవినీతికి బాద్ షాలా మారాడని విమర్శించారు. ఆయన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే.. అరుపులే అని పేర్కొన్నారు. అమిత్ షా బెస్ట్ విలన్గా, బండి సంజయ్ బెస్ట్ కమెడియన్గా, కిషన్ రెడ్డి కన్ఫ్యూజన్ రెడ్డిగా మారారని జీవన్ రెడ్డి ఎద్దెవా చేశారు.
టీఆర్ఎస్ఎల్పీలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తుక్కుగూడ సభ తర్వాత బీజేపీ తుక్కు తుక్కు అయిందన్నారు. అమిత్ షా సభకు జనం స్పందన కరువైందన్నారు. కేటీఆర్ లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా అమిత్ షా పారిపోయాడని ధ్వజమెత్తారు. నిన్నటి కమలం సభ కామెడి షోగా మారిందన్నారు. బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాలేదన్నారు.
కేసీఆర్ది నిజాం పాలన కాదు నిజాల పాలన అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. విభజన హామీలను అమలు చేయడంలో బీజేపీ తెలంగాణను మోసం చేసిందన్నారు. తెలంగాణకు రూ. 2 లక్షల 52 వేల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ డబ్బులన్నీ అమిత్ షా అకౌంట్లో వేసుకున్నారా? లేక కిషన్ రెడ్డి అకౌంట్లో వేసుకున్నారా? అని నిలదీశారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్దే విజయం అని జీవన్ రెడ్డి తేల్చిచెప్పారు. బీజేపీకి మళ్లీ డిపాజిట్లు గల్లంతేనని చెప్పారు.