హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రేబిస్ వ్యాధి సోకిందని.. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. సమాఖ్య స్ఫూర్తి తెలియని వ్యక్తి పీసీసీ ప్రెసిడెంట్ కావడం కాంగ్రెస్ దౌర్భాగ్యమని చెప్పారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డిని చంద్రబాబు లిల్లీపూట్ అని చెప్పారు. రేవంత్కు చంద్రబాబుకు మధ్య ఉన్నది అక్రమ సంబంధమని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలిస్తే తప్పేందని నిలదీశారు. ముఖ్యమంత్రులు దేశ ప్రధానిని కలవకూడదని రాజ్యాంగంలో ఏదైనా నిబంధన ఉన్నదా అని ప్రశ్నించారు. ప్రతి సందర్భాన్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడటం దుర్మార్గమని ఆరోపించారు.
రేవంత్ అంటే సంచులు.. సంచలనం అని అందరికీ తెలుసని ఎద్దేవాచేశారు. పలువురు ముఖ్యమంత్రులు ఆయా సందర్భాల్లో ప్రధానులను కలిసిన ఫొటోలను జీవన్రెడ్డి ప్రదర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చైనా దేశ రాయబారిని కలిశారని.. రేవంత్ వ్యవహారంలో చూడాలంటే రాహుల్ దేశద్రోహానికి పాల్పడ్డారా? అనేలా అనుమానం వస్తున్నదని చెప్పారు. రేవంత్ ఇప్పటికైనా బక్వాస్ మాటలు బంద్ చేయాలని లేదంటే ప్రజలే బుద్ధిచెప్తారని హెచ్చరించారు. ఎంఐఎం మతతత్వం గురించి మాట్లాడుతున్న రేవంత్.. కేరళలో ముస్లిం లీగ్ కాంగ్రెస్ మిత్రపక్షం అనే విషయాన్ని మరిచిపోతున్నారని చెప్పారు. రేబిస్ సోకినవాడిలా మాట్లాడుతున్న రేవంత్కు ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలో తమకు తెలుసునని పేర్కొన్నారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్లో పోటీచేయాలని జీవన్రెడ్డి సవాల్ విసిరారు. అక్కడ డిపాజిట్ తెచ్చుకొని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని సూచించారు.
సీఎం ఢిల్లీలో ఉంటే విపక్షాలకు నిద్రపట్టడం లేదు
సీఎం కేసీఆర్ వారంరోజుల పాటు ఢిల్లీలో ఉంటే రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదని జీవన్రెడ్డి ఎద్దేవాచేశారు. పాదయాత్రతతో బండి సంజయ్ కాళ్లకు బొబ్బలెక్కుడే కానీ.. ప్రజల మద్దతు లేదని విమర్శించారు. వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్న ఆయన యాత్రను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. బండి సంజయ్, గుండు అర్వింద్ కుసంస్కారుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.