హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని స్థాపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. స్వయం పాలనలో ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని పేర్కొన్నారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడారు.
కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యాపార కోణంలో పాలన కొనసాగిస్తున్నారని బాలరాజు మండిపడ్డారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలను దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్ను రూపకల్పన చేశారు. పేదల అభివృద్ధి కోసం పరితపిస్తూ పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో మేం పని చేయడం సంతోషంగా ఉంది. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. సంక్షేమ పథకాలకు అధికంగా నిధులు కేటాయించారు. పేదల కండ్లలో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. రాష్ట్ర పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఐ అండ్ పీఆర్ విభాగాన్ని వాడుకోవాలన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిన ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశ రూపురేఖలు మారే అవకాశం ఉంది. దేశంలోని పేదరికాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.
ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధాని ఆలోచించని విధంగా దళిత బంధు అనే అద్భుతమైన పథకాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఈ పథకం దేశ వ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. దళిత బంధు పథకం వల్ల దళితులు అభివృద్ధి చెందుతారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు విగ్రహాల పేరిట రాజకీయం చేస్తున్నారు. అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని స్థాపించేందుకు కేసీఆర్ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. స్వయం పాలనలో ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. గిరిజన, ఆదివాసీలు కూడా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా కొనసాగుతున్నారు. ఇదంతా కేసీఆర్ సంస్కరణల వల్లే సాధ్యమైందన్నారు. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి తూట్లు పొడుచుతుందన్నారు. మీకు అంబేద్కర్పై ప్రేమ ఉంటే దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని బీజేపీకి గువ్వల బాలరాజు సవాల్ విసిరారు.