హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ.. బ్రిటీష్ పాలనను తలపిస్తున్నదని, విభజించి పాలించు విధానాన్నే మోదీ అనుసరిస్తున్నారని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జాజుల సురేందర్ విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చటమే మోదీ పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. రాష్ర్టానికి కేంద్రం ఇచ్చిన హామీలపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయాలని, లేకపోతే ఈ నెల 5 నుంచి రాష్ట్ర బీజేపీ నేతల వెంటపడతామని హెచ్చరించారు. ప్రధాని మోదీ తెలంగాణపై వివక్ష ప్రదర్శించటం మానుకోవాలని సూచించారు. ప్రధాని నుంచి బీజేపీ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ర్టాల బీజేపీ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే, తమరాష్ర్టాల్లో వీటిని అమలుచేయాలనే ఆలోచన తప్పక వస్తుందని చెప్పారు. బండి సంజయ్ కొత్తబిచ్చగాడిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కాదని, నిర్మాణాత్మకంగా ప్రజలు ఆమోదించేలా మాట్లాడాలని సూచించారు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు కుటుంబానికి రూ.25 వేలు ఇస్తామన్న బీజేపీ తోకముడిచిందని ఎద్దేవాచేశారు. మోదీని చూస్తే కేసీఆర్కు భయం మొదలైందని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ భయపడితే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అంటే అభివృద్ధికి పర్యాయ పదమని (కామ్ చల్తా రహేగా) అని అభివర్ణించారు. తెలంగాణ కేసీఆర్ వెంటే ఉన్నదని, ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి భారీ చేరికలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేనేలేదని చెప్పారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన మోదీ, ఏ ముఖం పెట్టుకొని హైదరాబాద్ వస్తున్నారని ఎమ్మెల్యే జాజుల సురేందర్ నిలదీశారు. తెలంగాణకు ఇచ్చిన ఒక హామీని కూడా బీజేపీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ యువతకు శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేసిన దుర్మార్గ పాలన బీజేపీదని మండిపడ్డారు. అగ్నిపథ్ స్కీమ్ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మిడతల దండుగా వస్తున్న బీజేపీ నేతలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.