ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్, సెప్టెంబర్ 30: ‘ఒకసారి అవకాశం ఇవ్వండి.. ఉప ఎన్నికలో గెలిపించండి. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉం టా. సీఎం కేసీఆర్తో మాట్లాడి నియోజకవర్గానికి 5 వేల ఇండ్లు మంజూరు చేయించి కట్టిస్తా’ అని టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. గురువారం ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి, బోగంపాడు గ్రామాల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రోడ్డు వెంట కలిసిన వృద్ధులు, రైతులు, యువకులను ఆప్యాయంగా పలుకరిస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరగా, గ్రామస్థులు సైతం శ్రీనివాస్కు జై కొట్టారు. అనంతరం ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. పేదల కోసం సీఎం కేసీఆర్ 4 వేల ఇండ్లు ఇస్తే ఒక్కటీ కట్టించలేదని ఆరోపించారు. మంత్రిగా ఉండి కూడా పని చేయించలేని వ్యక్తి.. రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తడో ఆలోచించాలని కోరారు. తనను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటానని, పేద ప్రజల కోసం నియోజకవర్గానికి 5 వేల ఇండ్లు మంజూరు చేయించి కట్టిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి పథకాలు బీజేపీ పాలిత 18 రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉన్నాయా..? ఆ పార్టీ నాయకులు చెప్పాలని డిమాండ్చేశారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. ప్రతిపక్షాల ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే వారిని ఆశీర్వదించాలని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని శిరసు వంచి కోరుతున్నట్టు చెప్పారు.