హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాల విధ్వంసాన్ని రూపుమాపి ఏడున్నరేండ్లలో దేశానికే మార్గదర్శనం చేస్తున్న తెలంగాణను చూసి బీజేపీ, కాంగ్రెస్కు కండ్లు మండుతున్నాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చెప్పారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు రెండు పార్టీలు దండయాత్రకు వస్తున్నాయని మండిపడ్డారు. గురువారం టీఆర్ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ మొదటి నుంచి తెలంగాణపై వివక్షను ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యానికి ఈ రెండు పార్టీలే కారణమని ఆరోపించారు. బీజేపీ 2000లో ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్తో పాటే తెలంగాణ ఏర్పాటుచేసి ఉంటే బలిదానాలు జరగకపోయేవని చెప్పారు.
కాంగ్రెస్ 2004లో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకొని, తరువాత మాట తప్పి ఆలస్యం చేసి వేల మంది చావులకు కారణమైందని ఆరోపించారు. ఈ పార్టీల మోసానికి దశాబ్దాలుగా దేశమంతా నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురైందని.. అందుకే సీఎం కేసీఆర్ వీటి నుంచి దేశం విముక్తి కావాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. దేశమంతా చీకట్లు అలముకొంటే తెలంగాణలో మాత్రమే 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా అవుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్కు ఉన్న విజన్, జాతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని తేల్చిచెప్పారు. దున్నపోతు ప్రభుత్వం కేంద్రమైతే.. ఆ ప్రభుత్వంపై ఈగ వాలకుండా కాంగ్రెస్ అడ్డుపడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాహుల్.. ఢిల్లీ, జేఎన్యూకు పోలేదేం?
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ రిటైర్ అవుతారో.. ఫైటర్ అవుతారో తేల్చుకోవాలని సుమన్ సవాల్ విసిరారు. రాహుల్ చేతగానితనం వల్లే బీజేపీ గెలుస్తున్నదని ఆరోపించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రజాసమస్యలపై పోరాటం చేయకుండా, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో పర్యటించటం వల్ల ప్రయోజనం లేదన్నారు. బీజేపీ దారుణాలపై రాహుల్ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ, జేఎన్యూలో వామపక్ష విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడులు చేసి తలలు పగులగొడితే రాహుల్.. ఆ వర్సిటీలను ఎందుకు సందర్శించలేదని నిలదీశారు.
రేవంత్.. జగ్గారెడ్డిది ఆధిపత్య భావజాలం
ఉస్మానియా వీసీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే రేవంత్రెడ్డి, జగ్గారెడ్డి అగ్రవర్ణ ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శించారని సుమన్ విమర్శించారు. బీసీ అయిన వీసీకి కాంగ్రెస్ నేతలు చీర, గాజులు పంపటాన్ని తీవ్రంగా ఖండించారు. తాము చిల్లరగాళ్లం కాదని.. చీల్చి చెండాడే వాళ్లమని స్పష్టంచేశారు. రేవంత్, జగ్గారెడ్డి పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే తగిన సమాధానం చెప్తామని హెచ్చరించారు. డ్రగ్స్ వాడకంపై వస్తున్న ఆరోపణల నుంచి రాహుల్ బయటపడాలంటే శాంపిల్స్ ఇవ్వాలని డిమాండ్చేశారు. వైట్ చాలెంజ్ కోసం ‘రాహుల్ తన వెంట్రుక తీసి ఇస్తారో? రేవంత్నే వెంట్రుకలా తీసిపారేస్తారో’ తేల్చుకోవాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నడ్డా..ఈ ప్రశ్నలకు బదులివ్వు