హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కావాలంటే తాము సమిధలుగా మారైనా సరే, తెలంగాణను మాత్రం గుజరాత్కు బానిస కానివ్వబోమని ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. విగ్రహాలు, విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే పరిస్థితికి చరమగీతం పాడుతామని తేల్చి చెప్పారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వీరు.. ప్లీనరీలో టీఆర్ఎస్ చేసిన తీర్మానాలకు జడిసి బీజేపీ, కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జాతిహితం కోసం నడుం కడుతామంటే.. బండి సంజయ్, రేవంత్రెడ్డి మతిస్థిమితం కోల్పోయినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ చేసేది పాదయాత్ర యాద్ర కాదని, పాతాళ యాత్ర అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారితే బీజేపీ జీర్ణించుకోవటం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అవినీతి ఆకాశమంత ఎత్తుకు ఎదిగితే, తెలంగాణలో అన్ని విభాగాల్లో అవార్డులు వస్తున్నాయని తెలిపారు. మోదీ పాలనతో దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, అందుకు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలే సాక్ష్యమని, అదే తెలంగాణలో వేలాది ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని వివరించారు. దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో దళితులను చంపేందుకు బీజేపీ తుపాకులకు లైసెన్సులు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ నాయకులు పిచ్చి కూతలు కూస్తున్నారని, వారిపై తమ జాతి తిరగబడితే తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను పలుచన చేయాలని చూస్తే బీజేపీకి బరాబర్ బుద్ధి చెప్పుడు ఖాయమని హెచ్చరించారు. రాష్ర్టాన్ని బీజేపీ విష కౌగిలిలోకి పోనివ్వబోమని, తాము దేనికైనా రెడీ అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో కాలుపెట్టాలంటే ముందు.. తెలంగాణ అమరవీరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నవభారతాన్ని నిర్మిస్తారు: గువ్వల
ప్లీనరీ తీర్మానాలతో తమ బతుకులు పాతాళంలోకి పోతాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని గువ్వల బాలరాజు మండిపడ్డారు. బండి సంజయ్ వాగుబోతుగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఒకని అయ్యకు భయపడరని, ఢిల్లీ కోటను బద్దలు కొట్టి నవభారతాన్ని నిర్మిస్తారని తేల్చి చెప్పారు. బీజేపీ నేతలు ఇలాగే ప్రవర్తిస్తే సీఎం కేసీఆర్ అనుమతి తీసుకొని ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని చాటుతామని ఆయన స్పష్టం చేశారు.
ప్లీనరీపై దేశవ్యాప్తంగా చర్చ: కేపీ వివేకానంద
దేశాన్ని ద్వేషించేవారికి సీఎం కేసీఆర్ సందేశం అర్థం కాదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీని తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తిగా గమనించారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ఆంతర్యాన్ని బుద్ధి జీవులు అర్థం చేసుకొన్నారని, బండి సంజయ్, గాలికి వచ్చి గాలికిపోయే మధుయాష్కీ లాంటి వాళ్లకు అర్థం కావని విమర్శించారు. మధుయాష్కీ బేస్లెస్ లీడర్ అని, కిషన్రెడ్డి కన్ఫ్యూజన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఫుట్పాత్గాడిలా బండ్ సంజయ్ వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇంట గెలిచి రచ్చ గెలవాలని, అమేథీలో ఏం జరుగుతుంతో చూసుకోవాలని హితవు పలికారు.