హైదరాబాద్ : ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ రైతులను ముంచిన బీజేపీ ఇప్పుడు సింగరేణి కార్మికులను ముంచేందుకు కుట్ర చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణపై కక్ష కట్టిందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గమనించాలని సూచించారు.
కోల్ బ్లాక్లను వేలం వేయొద్దని కోరుతూ.. సింగరేణి కార్మికులు మూడు రోజుల పాటు సమ్మె చేసినప్పటికీ కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడని రాష్ట్ర బీజేపీ నేతలను సింగరేణి యువత నిలదీయాలి. కార్మిక లోకం బీజేపీపై తిరగబడాలి. బీజేపీ నేతలు ఢిల్లీలో దావత్లు బంద్ చేసి సింగరేణి కార్మికులతో మాట్లాడాలి. కోల్ బ్లాక్ వేలాన్ని ఆపాలని మోదీతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. సింగరేణిపై మాట్లాడకుంటే బీజేపీ భరతం పడుతామని బాల్క సుమన్ హెచ్చరించారు.
కోల్ బ్లాక్లను ఆదానీకి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని తెలిపారు. గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బొగ్గు బ్లాక్లను వేలం వేయొద్దని ఆ రాష్ట్రాల సీఎంలు మోదీకి విజ్ఞప్తి చేశారు. క్షణాల్లోనే ఆ ప్రక్రియను విరమించుకున్నారు. సీఎం కేసీఆర్ కూడా అదే రీతిలో కేంద్రానికి లేఖ రాస్తే.. మోదీ నుంచి స్పందన లేదని బాల్క సుమన్ ధ్వజమెత్తారు.