హైదరాబాద్ : తెలంగాణను సీఎం కేసీఆర్ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆరూరి రమేశ్ మాట్లాడారు. గతంలో బడ్జెట్ అంటే అంకెల గారడీ ఉండే.. పేపర్లపై రంగులు వేసి, రింగులు పెట్టి పేపర్లు అందించేవారు. ఇవాళ బడ్జెట్ అంటే.. అనేక వర్గాల అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నిండి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలు బడ్జెట్ కోసం ఆశగా ఎదురుచూసే రోజులు వచ్చాయన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం తమ బడ్జెట్ను జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఇది పేదల బడ్జెట్ కాబట్టి.. పేదలకు మేలు జరుగుతుంటే బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
దూరదృష్టితో ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను కేసీఆర్ సమీకరించుకుని, సంపదను పెంచుతున్నారు. పాలనలో మార్పులు తీసుకొచ్చి, అద్భుతాలు సృష్టించారు. కరోనా విపత్తులోనూ తెలంగాణ రాష్ట్రం 2.2 శాతం పాజిటివ్ వృద్ధిరేటును సాధించింది. ఈ ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. గత పాలకులు అణగారిన వర్గాలను పట్టించుకోలేదన్నారు. పేద వర్గాల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
ఆసరా పెన్షన్లతో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు. టీడీపీ హయాంలో పెన్షన్ల కోసం చావుల కోసం ఎదురుచూసేది. కాంగ్రెస్ హయాంలో రూ. 200 పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో రూ. 2016 పెన్షన్ ఇచ్చి భరోసా నింపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుతో పేదల ఇండ్లలో వెలుగులు వచ్చాయన్నారు. ఇలా అనేక వర్గాలకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరూరి రమేశ్ పేర్కొన్నారు.