హైదరాబాద్ : తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేం అంబేద్కర్ వారసులం.. బీజేపీ వాళ్లు గాడ్సే వారసులు.. అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను వక్రీకరిస్తున్నారని వారు మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో కడియం శ్రీహరి, బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించింది బీజేపీనే అని కడియం శ్రీహరి మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు అవసరం మేరకు ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణ చేశారు. దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలని సీఎం కేసీఆర్ అనడంలో తప్పేముంది. పేదలు మరింత పేదలుగా.. ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినంత బడ్జెట్ కూడా కేంద్రం కేటాయించలేదు. బీజేపీకి చేతనైతే దళితబంధు దేశమంతా అమలు చేయాలి. సీఎం కేసీఆర్ ప్రకటనతో బీజేపీకి వణుకు పుట్టింది. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కేంద్రం పెంచడం లేదు. బీజేపీ నూటికి నూరు శాతం దళిత వ్యతిరేక పార్టీ. అంబేద్కర్ మాకు గాడ్ ఫాదర్.. బీజేపీ వాళ్లు గాడ్సే వారసులు. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదు అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయించింది సున్నా అని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్షాలు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు వ్యవహరిస్తున్నాయి. సీఎం కేసీఆర్ మాటలను వక్రీకరిస్తున్నారు. రాజ్యాంగం మారిపోయినట్లు హడావుడి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మాటల్లో స్పష్టత ఉంది. దేశ పరిస్థితులపై చర్చ జరగాలి. మేం అంబేద్కర్ వారసులం. అనుమతి లేని క్రిప్టో కరెన్సీపై పన్ను వేసిన దద్దమ్మ బీజేపీ సర్కార్. తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడగలేని దద్దమ్మలు బీజేపీ ఎంపీలు అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు 105 సార్లు రాజ్యాంగ సవరణ చేశాయి. రాజ్యాంగ సమీక్షకు కమిటీ వేసిన చరిత్ర బీజేపీ ప్రభుత్వానిదే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల మీద హింస, హత్యాచారాలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే తీర్పు ఇచ్చిన జడ్జికి బీజేపీ సర్కార్ చైర్మన్ పదవి ఇచ్చింది. రీసెర్చ్ స్కాలర్స్కు ఇచ్చే రాజీవ్గాంధీ ఫెలోషిప్ను కేంద్రం రద్దు చేసింది. బడ్జెట్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే బీజేపీ నేతల ప్రయాస. అంబేద్కర్ ఆలోచనల ప్రకారమే టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు అట్టడుగు వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు అని బాల్క సుమన్ చెప్పారు.