హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు ‘చింతపండు’ అయిద్దని టీఆర్ఎస్ హెచ్చరించింది. తీన్మార్ మల్లన్నకు చెంపదెబ్బలతోపాటు చెప్పు దెబ్బలు తప్పవని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చిచెప్పారు. అసభ్య పదజాలంతో ఇష్టారీతిగా పోస్టింగులు పెడుతున్న తీన్మార్ మల్లన్నను బట్టలూడదీసి కొట్టాలని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కుమారుడిని కించపరిచేలా తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ చానల్లో పెట్టిన పోస్టుపై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బాల్క సుమన్, జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
హిమాన్షుపై తీన్మా ర్ మల్లన్న వాడిన అత్యంత జుగుప్సాకరమైన భాషను ఖండిస్తున్నామని బాల్క సుమన్ అన్నారు. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను లాగటం బీజేపీకి అలవాటేనని, ఆ పార్టీ విష సంస్కృతిలో భాగంగానే తీన్మార్ మల్లన్న ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబితేనే మల్లన్న తన యూట్యూబ్ చానల్లో అలా అసభ్యపోస్టులు పెడుతున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ సహనానికి హద్దు ఉంటుందని, ఓపిక నశిస్తే అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తామన్నారు. ఇటువంటి చర్యలు యథేచ్ఛగా కొనసాగుతుంటే పోలీసులు సూమోటోగా ఎందుకు కేసు స్వీకరించరని ప్రశ్నించారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే తమ కార్యకర్తలు స్పందిస్తారని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు టీఆర్ఎస్కు సంబంధం లేదని స్పష్టంచేశారు.
‘తీన్మార్ మల్లిగాడు జర్నలిస్టు కాదు. బ్లాక్ లిస్టులో ఉన్న బీజేపీ నేత’ అని జీవన్రెడ్డి ఫైర్ అయ్యారు. తీన్మార్ మల్లన్న తన తీరు మార్చుకోకపోతే టీఆర్ఎస్ శ్రేణులు ఎకడికకడ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ కుమారుడిపై తీన్మార్ మల్లన్న వాడిన భాషనే తాము కేంద్రమంత్రులు అమిత్షా, కిషన్రెడ్డి కొడుకులపై వాడితే సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఈ తీన్మార్ మల్లిగాడు గ్రామాల్లోకి వచ్చినప్పుడు బట్టలూడదీసి కొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా వేదికగా పిల్లలపై వికృతమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ప్రజాజీవితంలో ఉన్న నాయకుల కుటుంబాలపై ద్వేషపూరిత ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాసేవ మరిచి నాయకుల కుటుంబాలపై దుష్ప్రచారం చేయ్యడమేనా బీజేపీ సిద్ధాంతం? ఇలాంటి నీచపు చర్యలను ప్రజలు ఏమాత్రం హర్షించరు. – తన్నీరు హరీశ్రావు, ఆర్థికశాఖ మంత్రి
మంత్రి కేటీఆర్ కుమారుడిపై బీజేపీ అండదండలతో తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలు, అరాచకాలను చూస్తూ ఊరుకోబోం. రాజకీయ విధానాల గురించి మాట్లాడాల్సిన బీజేపీ.. తన కార్యకర్తలతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయిస్తున్నది. ఇలాంటి చర్యలతో మా పార్టీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు. -పువ్వాడ అజయ్కుమార్, రవాణాశాఖ మంత్రి
మంత్రి కేటీఆర్ కుమారుడిపై తీన్మార్ మల్లన్న చేసిన ప్రచారం అత్యంత నీచమైంది. రాజకీయాల కోసం కుటుంబాలు, పిల్లలను వాడుకొని విద్వేషం చిందించే సంస్కృతిని బీజేపీ నాయకులు తెచ్చారు. పిల్లలను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేయడంకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదు. -సత్యవతిరాథోడ్, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి
దిగజారిపోయి కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగడం, వారిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం అవమానకరం.
ఈ సిగ్గుమాలిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. -డాక్టర్ రంజిత్రెడ్డి, లోక్సభ సభ్యుడు
చాలా దురదృష్టకరం, అత్యంత దయనీయం. రాజకీయాలతో సంబంధం లేని కుటుంబసభ్యులు, పిల్లలపై విషం చిమ్ముతున్న బీజేపీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆ పార్టీ పెంచిపోషిస్తున్న సంస్కృతి, ప్రవర్తన బయటపడింది. ఇలాంటివారిని చట్టం ద్వారా శిక్షించాలి. -పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ
మానసిక వేదనను అర్థం చేసుకోకుండా చిన్నపిల్లాడిని బాడీషేమింగ్ చేసిన తీన్మార్ మల్లన్న సైకో. ఆయన చౌకబారు రాజకీయ ప్రచారాన్ని ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. చట్టం ద్వారా కఠినంగా శిక్షించాలి. -పురాణం సతీశ్కుమార్, ఎమ్మెల్సీ
ఇలాంటి చిల్లర వెధవలను వెనకేసుకొచ్చే బీజేపీ నాయకులు సిగ్గుపడాలి. మీ కుటుంబసభ్యులపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇలాగే సమర్థించుకుంటారా! -సుంకె రవిశంకర్, ఎమ్మెల్యే చొప్పదండి
రెండు తగిలితేకాని తత్వం బోధపడలేదు. సిస్టం హ్యాక్ అయిందంట. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకొనే ఇలాంటి వాళ్లు తెలంగాణకు పట్టిన చీడ పురుగులు. బీజేపీ ముసుగు వేసుకున్న వీడి బాగోతం అందరికీ అర్థమవుతున్నది. -చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే అందోల్
రామ్.. మీ సేవలకు మేము కృతజ్ఞులం. మీరు దూరదృష్టితో విలువలు పాటిస్తూ వ్యూహాలను అమలుచేస్తారు. సోషల్ మీడియా, భారతీయ మీడియా ఒక వరం అలాగే ఒక శాపం లాంటివి. దయచేసి వాళ్లకి మిమ్ములను కిందకు లాగే అవకాశం ఇవ్వకండి. -కిట్టు కొల్లూరి, నియోట్రైబ్వీసీ ఫౌండర్
సంస్కారం లేని తెలంగాణ బీజేపీ.. మా కుటుంబాలు, పిల్లలను లక్ష్యంగా చేసుకొని అధోగతికి దిగజారుతున్నది. ఈ చీప్ ట్రిక్స్ మమ్ములను విచ్ఛిన్నం చేయలేవు. మా పార్టీని ఇంకా బలోపేతం చేస్తాయ్. -కొండూరు రవీందర్రావు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ చైర్మన్
శ్రీరాముడి కల్యాణం సందర్భంగా భక్తులు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించటం ఆనవాయితీ. ప్రభుత్వం తరఫున సీఎం సమర్పిస్తారు. అయితే 2017లో సీఎం వేడుకలకు హాజరుకాలేని పరిస్థితిలో ఆ బాధ్యతను నాకు అప్పగించారు. అప్పుడు నేనే ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించాను. ఇందులో ఎటువంటి పొరపాటు జరగలేదు. హిమాన్షు వారి కుటుంబం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించారు. ఇది అపచారమో, ప్రొటోకాల్ ఉల్లంఘనో కానేకాదు. దీనిపై అప్పట్లోనే కొందరు రాజకీయం చేయగా స్పష్టమైన వివరణ ఇచ్చాను. అర్థంపర్థంలేని ఈ వ్యవహారాన్ని ఇప్పుడు మళ్లీ లేవనెత్తటం వారి తెలివితక్కువతనాన్ని చాటుతున్నది. పిల్లలు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతూ, వారిపై అసభ్యంగా దాడిచేయటం ద్వారా బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నది. సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దాడులు మా ప్రజాసేవను అడ్డుకోలేవు. -మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
స్వామివారిని భక్తితో కొలవటం అందరి హక్కు. హిమాన్షు కూడా దైవభక్తితో స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. దీనిపై రాజకీయం చేయడం తగదు. హిందువులను అవమానించటం, హిందూ సంప్రదాయాలను అపహాస్యం చేయటం, అర్చకులను అగౌరవపర్చటం తీన్మార్ మల్లన్నకు అలవాటైంది. గతంలో అనేకసార్లు బ్రాహ్మణులను అవమానపరిచేలా, కించపరిచేలా తన చానల్లో కథనాలు ప్రసారం చేశారు. హిందువులు సహనంతో ఉన్నారని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కుదరదు. -ఉపేంద్రశర్మ, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, బ్రాహ్మణ సేవా సమితి
ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నాయకురాలిగా పిల్లలను వేధించడాన్ని, కుటుంబసభ్యులపై ఇలాంటి అవమానకరమైన ప్రకటనలు చేయడాన్ని ఖండిస్తున్నా. మహిళలను కించపరచడం, బాడీ షేమింగ్ చేయడం సరికాదు. ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసిరావాలి. -వైఎస్ షర్మిల, టీఎస్ వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు
కనీస మర్యాద లేని అత్యంత బాధ్యతారహితమైన పోల్ ఇది. విధానపరమైన అంశాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవాలని నేనే అన్ని పార్టీలను కోరుతున్నా. కానీ, ప్రత్యర్థుల కుటుంబసభ్యులను ఇందులోకి లాగొద్దు. తెలంగాణలో ఇలాంటి అసభ్యత రాజకీయరంగంలోకి రాకుండా చూడాలి. -ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త
తీన్మార్ మల్లన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అతడు వాడిన భాష కించపరిచేలా ఉన్నది. కుటుంబసభ్యులను, వారి పిల్లలను రాజకీయాల్లోకి లాగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాడీ షేమింగ్ లాంటి అసభ్యకరమైన వ్యాఖ్యల విషయంలో రాజకీయాలకు అతీతంగా పోరాడాలి -మహేశ్ బిగాల, టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్