వర్షాలు, వరదపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా
జగిత్యాలలో రైతులను కాపాడేందుకు హెలికాప్టర్ వినియోగించాలని ఆదేశాలు
ఒడ్డుకు తీసుకొచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
సహాయ చర్యల్లో ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదతో ఇబ్బందిపడుతున్న ముంపు ప్రాం తాల ప్రజలకు సహాయం చేయడంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. సీఎం కేసీఆర్ అనుక్షణం వర్షాలు, వరద పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచనలు చేస్తున్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి సమీపంలో గోదావరి నది మధ్యలో చిక్కుకొన్న 9 మంది రైతులను సురక్షితంగా తీసుకొనిరావాలని ఆదేశించారు. వెంటనే జిల్లా యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో బోర్నపల్లికి చేరుకున్నది. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు నిలిచాయి. రాత్రి సుమారు పది గంటలకు వారిని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్కుమార్, కలెక్టర్, ఎస్పీ జిల్లా అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించింది.
అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
కేసీఆర్ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు స్థానికంగానే ఉంటూ వరద ప్రాంతాలను పరిశీలిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు పలు సూచనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అతి భారీ వర్షాలు కురిసిన కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ప్రత్యేకంగా ఇద్దరు ఐఏఎస్ అధికారులను సీఎస్ నియమించారు. సచివాలయంతో పాటు అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను సిద్ధం చేసి హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటుచేశారు. జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీశాఖ కూడా ఇదే తరహాలో ఏర్పాట్లు చేశాయి. విపత్తుల నిర్వహణశాఖ రెస్క్యూ టీమ్లను సిద్ధంగా ఉంచింది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సుద్దరేవు గ్రామ శివారులోని పందిపంపుల వాగు వరద ఉధృతిని పరిశీలిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్. చిత్రంలో ఎంపీ కవిత, కలెక్టర్ శశాంక తదితరులు
భద్రాచలంలో పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్