గజ్వేల్, సెప్టెంబర్ 25: గజ్వేల్లో జరిగినంత అభివృద్ధి రాష్ట్రంలో మరెక్కడా జరగలేదని అసెంబ్లీలో పొగడ్తలు కురిపించిన కాంగ్రెస్ నాయకులు.. గజ్వేల్ పర్యటించి ఇక్కడసలు అభివృద్ధే జరగలేదని విమర్శించడం సిగ్గుచేటని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్మిస్తున్న బస్టాండ్ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్కుమార్రెడ్డి, షబ్బీర్ అలీ గజ్వేల్ అభివృద్ధిపై చేసిన విమర్శలను ఖండించారు. స్థానిక నాయకుల చెప్పుడు మాటలు విని ఇక్కడ అభివృద్ధే జరగలేదని షబ్బీర్ అలీ విమర్శించడం సిగ్గుచేటన్నారు. గజ్వేల్ అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని, ఇక్కడి ప్రజలు చైతన్యవంతులని పేర్కొన్నారు. గజ్వేల్లో రూ. 3 కోట్లు, ప్రజ్ఞాఫూర్లో రూ.4 కోట్లతో మాడల్ బస్టాండ్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గజ్వేల్ అభివృద్ధిని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ చేసిన అభివృద్ధితో గజ్వేల్ 50 ఏండ్లు ముందుకెళ్లిందని పేర్కొన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీతో షబ్బీర్ అలీ వెన్నులో వణకు మొదలైందని, ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని పేర్కొన్నారు.
దమ్ముంటే సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలి
కాంగ్రెస్లో నిన్నమొన్నటి వరకు ఉత్తమ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి తన్నుకున్నారని, ఆ పార్టీకి దమ్ముం టే సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలని వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్లో హర్టికల్చర్ విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ యూనివర్సిటీ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు నిర్మించిన దవాఖానలతో ఇక్కడి అభివృద్ధి కండ్లకు కట్టినట్టు కనబడుతున్నదని తెలిపారు. వర్గల్లో పరిశ్రమల స్థాపన కోసం 1300 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి 250 గజాల ప్లాట్, నష్టపరిహారం అందించి వారి కి భరోసా కల్పించిందని వివరించారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చారని, స్థానిక నాయకులు కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు.
వారికి సిగ్గు, శరం, చీము నెత్తురు ఉంటే వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గజ్వేల్లో తొమ్మిదేండ్ల కాలంలో జరిగిన అభివృద్దిని చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్ననని, చూసేందుకు ఉత్తమ్, షబ్బీర్ సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. 98665 36161 నంబరుకు ఫోన్ చేసి గజ్వేల్ అభివృద్ధిపై చర్చకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోద్దిన్, కౌన్సిలర్లు గోపాల్రెడ్డి, రజిత, బాలమణి, బాలేశ్, శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నవాజ్మీరా, నాయకులు శ్రీధర్, సమీర్, కనకయ్య, మతిన్, రమేష్గౌడ్, వెంకటేశం, శ్రీనివాస్, ఉమార్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.