హైదరాబాద్ సిటీబ్యూరో/అబిడ్స్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ: దేవుడి ముసుగులో రాజకీయాలు చేయడం బీజేపీకి పరిపాటిగా మారింది. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. శోభాయాత్రకు స్వాగతం పలికే వేదికలను సైతం తమ రాజకీయల కోసం వాడుకొన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను హైదరాబాద్కు రప్పించి, నిమజ్జనం రోజు రాజకీయం చేయాలని కుట్రపన్నారు. వారి కుట్రలను సామాన్య భక్తులు భగ్నంచేశారు. ధర్మ కార్యానికి వచ్చి.. రాజకీయం చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ తరుణంలోనే మోజంజాహి మార్కెట్ వద్ద స్థానికులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బీజేపీ కుట్రలను తిప్పికొట్టారు.
దేవుని వద్ద రాజకీయాలపై నిలదీత
చార్మినార్ వద్ద శుక్రవారం ఏర్పాటుచేసిన వేదికపై మాట్లాడేందుకు అస్సాం సీఎం ప్రయత్నించగా, పోలీసులు వారించారు. తన కాన్వాయ్లో నుంచి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్పై పిచ్చికూతలు కూశారు. దీంతో శోభాయాత్రలో ఉన్నవారు కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. దేవుడి కార్యం కోసం వచ్చి రాజకీయాలు మాట్లాడటమేమిటని ఆగ్రహించారు. అక్కడి నుంచి మోజంజాహి మార్కెట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికకు హిమంత బిశ్వ చేరుకున్నారు. అప్పటికే భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకుడు భగవంతరావు మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీంతో కింద నుంచి సామాన్య ప్రజలు అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఇంతలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్ వేదికపైకి వెళ్లి భగవంతరావు ముందున్న మైక్ను లాగేశారు. పక్కనే ఉన్న అస్సాం సీఎంను నిలదీశారు. ‘నీవు వచ్చిన పనేంటి.. ధర్మ వేదికపై ఉండి.. హిందు ధర్మం కోసం.. భక్తితో వచ్చిన వాడివి భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజలు చేసి వెళ్లు.. నీ రాజకీయాల కోసం ఈ ధర్మ వేదికను వాడుకుంటావా? మేం కూడా కరుడుగట్టిన హిందువులమే.. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తావా? అలా చేస్తే మేం ఉరుకుంటామా?’ అంటూ కడిగిపారేశారు. దీంతో నందకిశోర్ను వేదికపై ఉన్నవారితోపాటు హిమంత బిశ్వ శర్మ సెక్యూరిటీ కిందకు పంపించారు. కింద ఉన్న నగర పోలీసు బృందాలు వెంటనే నందకిశోర్ను అబి డ్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. స్టేజీ కింద ఉన్న సామాన్య ప్రజలు నందకిశోర్ మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది.. దేవుడి కార్యంలో రాజకీయం ఏంటంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొనగా, పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.
ఫ్లెక్సీ ఏర్పాటుపై రాద్ధాంతం
గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ పర్యవేక్షించారు. మోజంజాహి మార్కెట్ వద్ద వేదిక సమీపంలో మంత్రి ఫ్లెక్సీని చూసిన బీజేపీ నాయకులు దానిని తొలగించాలంటూ వివాదాన్ని సృష్టించారు. భాగ్యనగర ఉత్సవ కమిటీ, బీజీపీ నాయకులు ఆ తరువాత అస్సాం సీఎం ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటంటూ ప్రజలు ప్రశ్నించారు.
అస్సాం సీఎంది బాధ్యతారాహిత్యం
అసోం సీఎం వ్యాఖ్యలు బాధాకరమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. చార్మినార్ నుంచి ట్యాంక్బండ్ వరకు దాదాపు 19 స్టేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని చెప్పారు. మైకులు కూడా ఏర్పాటు చేసిందన్నారు. వినాయక నిమజ్జనం కోసం వచ్చిన హిమంత బిశ్వశర్మ.. రాష్ట్ర సీఎం కేసీఆర్ను, ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అసోం సీఎం తీరు సరికాదని హోంమంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. హైదరాబాద్లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కోసమే అస్సాం సీఎం వచ్చారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. కేసీఆర్ సారథ్యంలో ఎనిమిదేండ్ల నుంచి అల్లర్లు లేకుండా హైదరాబాద్లో నిమజ్జనం జరుగుతున్నదని, అసోం సీఎం రాకతోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.