న్యూస్నెట్వర్క్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తాము అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,000కి పెంచిన కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై రూ.600 సబ్సిడీ ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ జీడీపీని పెంచడానికి బదులు గ్యాస్(జీ), డీజిల్(డీ), పెట్రోల్(పీ) ధరలను పెంచుతున్నదని ఎద్దేవా చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, తెలంగాణకు ప్రత్యేక సబ్సిడీ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి. జాతీయ రహదారులపై ఖాళీ గ్యాస్బండలను ప్రదర్శిస్తూ రాస్తారోకోలు నిర్వహించారు. కట్టెల పొయ్యిలతో వంటా వార్పు చేపట్టారు. వాహనాలను ఎండ్లబండ్లకు కట్టి లాగారు. నల్లజెండాలను ప్రదర్శిస్తూ సైకిళ్లు తొక్కారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు.ఆయా కార్యక్రమాల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్అలీ, కొప్పుల ఈశ్వర్, జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బేగంపేటలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. సాఫీగా ప్రజాజీవనం గడుపుతున్న తెలంగాణ బిడ్డలను మరోసారి రోడ్లపైకి తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్కు దక్కుతుందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో యువత ఆలోచించాలని కోరారు. 2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.60 ఉండేదని గుర్తుచేశారు. ప్ర స్తుతం ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ పెట్రోల్ ధరలు పెంచారని విమర్శించారు. ఆయిల్ సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకొన్నారని మం డిపడ్డారు. బడా వ్యాపారవేత్తలు బ్యాంకులకు ఎగ్గొట్టిన రూ.11 లక్షల కోట్లను మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం, సామాన్యులకు ఏమీ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. పేదలకు ఇవ్వాల్సిన సబ్సిడీ డబ్బును పెద్ద కంపెనీలకు దోచి పెడుతున్నాదని విమర్శించారు. పేదలకు రుణమాఫీ చేయకుండా బడా పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా ఉద్యమాలకు మోదీ ప్రభుత్వం లొంగక తప్పదని పేర్కొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించేందుకు చేతనైతే ఢిల్లీలో కొట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సవాల్ చేశారు. పంజాబ్లో మాదిరిగానే రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనుగోలు చేసి, వడ్లకు డబ్బులు చెల్లించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్లపై రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర మంత్రి అసత్యాలు మాట్లాడితే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. ధరలు పెంచుతున్న బీజేపీని దేశం నుంచి తరమివేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ధరలు పెంచుతూ ప్రజలను నట్టేట ముంచుతున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సూర్యాపేటలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రజల జేబులు నింపుతుంటే.. ఆ జేబులకు మోదీ ప్రభుత్వం చిల్లులు పెడుతున్నదని పేర్కొన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే మహిళలు, పేదల నిరసనల జ్వాలల్లో ఆ పార్టీ మాడి మసైపోతుందని హెచ్చరించారు. మహబూబ్నగర్లో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎడ్లబండ్లపై వచ్చి నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజలకు శనిలా దాపురించిందని మండిపడ్డారు. జగిత్యాల జల్లా ధర్మపురి వద్ద జాతీయ రహదారిపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కట్టెల పొయ్యిపై కిచిడీ వండి ప్రజలు, కార్యకర్తలకు వడ్డించారు. నిర్మల్లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. మోదీ పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితి వచ్చిందని, మహిళలే ఆయనకు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హిమాయత్నగర్ వై జంక్షన్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, జాతీయ కార్యదర్శి అజీజ్పాషా, ఎఐటీయుసీ నాయకులు పాల్గొన్నారు.