ములుగు : కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు, దివ్యాంగులకు భగవంతుడు అన్యాయం చేసినా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని, వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని రాష్ట్ర స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకి బాల సహాయక కిట్స్, ప్రి- స్కూల్ కిట్స్, దివ్యాంగులకు రుణాలను శుక్రవారం ములుగులో మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనాథ బాలలు, దివ్యాంగుల హక్కులను కాపాడుతున్నట్లు తెలిపారు. కొవిడ్ వల్ల రాష్ట్రంలో దాదాపు 200 మంది అనాథలు అయ్యారన్నారు. ప్రభుత్వం వారికి పూర్తిగా అండగా ఉంటుందన్నారు.
ఇలాంటి పిల్లలకు సాయం చేసేందుకు సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకు రావడం సంతోషం అని వారికి ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగ సోదర, సోదరీమణులు తమ సొంత కాళ్లపై నిలబడేలా రుణాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు దేశాన్ని పాలించే జాతీయ పార్టీ పాపం పెరిగినట్లు పెరుగుతున్నాయన్నారు. గ్యాస్ ధర తీవ్రంగా పెరిగి మళ్ళీ కట్టెల పొయ్యిలు పెట్టుకునే కుటుంబాల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఆర్డీవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.