నల్లగొండ: అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అవసరం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అభివృద్ధి మాత్రమే మా ఎజెండా అని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి మునుగోడు మండల కేంద్రంలో రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజల ఆకలి తీర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్.. అద్భుతమైన పరిపాలన చేస్తూ దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని చెప్పారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులే ప్రకటించారని, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత అని ప్రకటించారు. జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేశామని, ఇంటింటికి సురక్షిత నది జలాలను అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత ఆకలిని పారద్రోలామని సగర్వంగా చెప్తున్నామని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని తెలిపారు.
రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో రైతులకు స్వర్ణయుగం వచ్చిందని పేర్కొన్నారు. 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి ఉమ్మడి నల్లగొండ జిల్లా రికార్డుల్లో నిలిచిందని పేర్కొన్నారు. పెద్ద నాయకులు ఉన్న నల్లగొండ జిల్లా కరువు కాటకాలతో అల్లాడి పోయిందని, స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లా సస్యశామలమయిందని, ప్రజల బాధలు తొలగిపోయాయన్నారు. ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని, ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్, మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్, యాదాద్రి ఆలయం ఇవన్ని జిల్లాకు మణిహారంలా నిలిచాయన్నారు. మునుగోడు నియోజకవర్గంలోనే భగీరథ పథకానికి శ్రీకారం చుట్టామని, పైలాన్ను కూడా సీఎం కేసీఆర్ ఇక్కడే ప్రారంభించారు చెప్పారు.