చౌటుప్పల్ : తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చేలా మునుగోడు ఓటర్లను మరింత చైతన్యపరచాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం డి.నాగారాం గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ముఖ్యంగా ఎన్నో దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పనితనాన్ని వివరించాలన్నారు.
అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కి ఓటేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని వివరించాలని సూచించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
దండు మల్కాపూర్ గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.