ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 9: టీఆర్ఎస్ – పీఆర్టీయూ టీఎస్ మధ్య సంబంధం పేగుబంధం లాంటిదని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో పీఆర్టీయూ టీఎస్ 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయ సంఘాలు కీలక పాత్ర పోషించాయని వేముల కొనియాడారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పీఆర్టీయూ.. టీఆర్ఎస్కు అందించిన సహకారం మరువలేనిదన్నారు. రాష్ట్రంలో లక్షా రెండు వేల మంది టీచర్లు ఉంటే అందులో 75 వేల మంది పీఆర్టీయూలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రయోజనాలు, హక్కులను కాపాడటానికి నిబద్ధతతో కలిసి పనిచేసే నాయకత్వం పీఆర్టీయూలో ఉన్నదని చెప్పారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మాట్లాడుతూ.. పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దగల శక్తి ఒక్క ఉపాధ్యాయులకే ఉన్నదన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నగర మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.