హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పార్టీ శ్రేణులు, కుటుంబసభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, తనయులు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాను ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడినట్టు లక్ష్మీపార్వతి మీడియాకు వెల్లడించారు. ‘ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు నేను చెన్నై వెళ్లాను. అక్కడ ఓ అమ్మాయి ఆత్మలతో మాట్లాడుతుందని కొందరు చెప్పగా విని ఆమెను కలిశాను. ఈ సందర్భంగా నేను ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను. నన్ను ఏమని పిలుస్తారని అడిగితే లక్ష్మి అని అన్నారు’ అని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో పలువురు నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్తదాన శిబిరం నిర్వహించింది.