జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్లో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి నివాళి
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): దేశం తెలంగాణ నమూనాను కోరుకొంటున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జయశంకర్ విగ్రహానికి ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు బొమ్మెర రామ్మూర్తి, నాయినేని రాజేశ్వర్రావు తదితరులు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. జయశంకర్ కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించారని చెప్పారు. రాష్ర్టాన్ని సాధించుకొన్న ఎనిమిదేండ్లలోనే దేశానికి తెలంగాణ మాడల్ కావాలని జాతీయ స్థాయిలో విస్తృత చర్చ సాగుతున్నదని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్లైన్తో మలిదశ ఉద్యమానికి సైద్ధాంతిక భూమికను జయశంకర్ రూపొందించారని మధుసూదనాచారి తెలిపారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష అంటూ తన ప్రసంగాలు, రాతల ద్వారా ప్రజలను మేల్కొలిపిన గొప్ప దార్శనికుడు జయశంకర్ అని కొనియాడారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం వచ్చి తీరుతుందని బలంగా నమ్మి, భావజాల వ్యాప్తికి రోడ్మ్యాప్ రూపొందించిన మహానుభావుడు జయశంకర్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థి దశ నుంచే ఉద్యమించి, జీవితాంతం పరితపించిన మహోన్నతుడు జయశంకర్ అని వీ ప్రకాశ్ గుర్తుచేసుకొన్నారు.
దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పేర్కొన్నారు. తెలంగాణను సాధించి అనతికాలంలోనే సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దేశానికే రోల్మోడల్గా తీర్చిదిద్దారని చెప్పా రు. జయశంకర్ సార్ బతికి ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాన్ని చూసి ఎంతో మురిసిపోయేవారని అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలోని తన చాంబర్లో టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీఎం కేసీఆర్ జయశంకర్ కలలను సాకారం చేశారన్నారు. విద్యార్థి దశ నుంచి జీవిత చరమాంకం వరకు తెలంగాణే శ్వాసగా.. ధ్యాసగా బతికిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు.
హజ్ యాత్రికులు క్షేమం గా మక్కాకు చేరుకొన్నారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం తెలిపారు. ఈ యాత్రికులు సోమవారం బయలుదేరారని చెప్పారు. మంగళవారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హజ్ యాత్ర ప్రారంభమైనందున హజ్ హౌజ్లో 24 గంటలపాటు పనిచేసేలా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. మూడో బ్యాచ్ ఈ నెల 24న తెల్లవారుజామున బయలుదేరుతున్నదని చెప్పారు. కంట్రోల్ రూం నంబర్లు 040-29390081, 040-29390026 అని పేర్కొన్నారు.