హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియను కొనసాగించేందుకు తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే పోస్టుల వారీగా, అభ్యర్థుల అప్షన్ల వారీగా మెరిట్ జాబితాలను కూడా సిద్ధం చేసింది. అయితే, తదుపరి నియామక ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్కు లేఖ చేసింది. ఈసీ అనుమతులను మంజూరు చేస్తే వెంటనే మెరిట్ జాబితాలను విడుదల చేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ను చేపట్టేందుకు సన్నద్ధం అవుతున్నది.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి మొత్తంగా పీజీటీ, టీజీటీ, డీఎల్, జేఎల్, పీడీ, లైబ్రేరియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ మొత్తంగా 9 విభాగాల్లో 9,210 పోస్టులను భర్తీ ప్రక్రియను ట్రిబ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్ అధారిత పరీక్ష (సీబీటీ)ను సైతం నిర్వహించింది. మొత్తం 6,52,413 మంది దరఖాస్తు చేసుకోగా 4,93,727 మంది పరీక్షలను రాశారు. అభ్యర్థుల నుంచి పోస్టుల వారీగా ఈ నెల 16 వరకు ఆప్షన్లను సైతం స్వీకరించింది. ప్రస్తుతం పోస్టులవారీగా 1 ః 2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో భర్తీ పక్రియకు అనుమతులు మంజూరు ఎన్నికల కమిషన్ను తాజాగా ట్రిబ్ విజ్ఞప్తి చేసింది. ఈసీ అనుమతులు మంజూరు చేస్తే వెంటనే పైస్థాయి నుంచి దిగువస్థాయి పోస్టుల భర్తీని చేపట్టాలని ట్రిబ్ నిర్ణయించింది. అందులోభాగంగా తొలుత డీఎల్, అటు తరువాత జేఎల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది.