మహబూబాబాద్, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, చిన్నారుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని గిరిజన, మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆలోచన మేరకు ఏర్పాటుచేసిన మదర్, చైల్డ్ కోసం పోలీస్ ఫ్రెండ్లీ రూమ్ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఫ్రెండ్లీ రూమ్లో సమకూర్చిన ఆట వస్తువులతో చిన్నారులు ఆడుకుంటుండగా మంత్రి కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారి మదర్, చైల్డ్ కోసం పోలీస్ ఫ్రెండ్లీ రూమ్ను ఏర్పాటు చేసిన ఎస్పీ శరత్చంద్ర పవార్ను అభినందించారు. శాంతిభద్రతల పరిరరక్షణ, మహిళల రక్షణ, నేర విచారణ, నేరస్థులకు శిక్షలు పడేలా విధులు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఫిర్యాదులు చేయడానికి, దోషులను కలవడానికి వచ్చిన తల్లి, పిల్లలు సేద తీరేందుకు ఈ ఫ్రెండ్లీ పోలీస్రూమ్ను ఏర్పాటుచేశామని.. మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎక్కువ సమయం పోలీస్స్టేషన్లో ఉండే సమయంలో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడకుండా తగిన విశ్రాంతి తీసుకునేందుకు బెడ్స్, చిన్నారులు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫీలింగ్ రాకుండా రూమ్లో అన్ని రకాల ఆట వస్తువులు అందుబాటులో ఉంచడం మంచి పరిణామమన్నారు.