హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉద్యమస్ఫూర్తితో నెలాఖరులోపు పోడుభూముల సర్వే, పరిశీలన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులను కోరారు. నిబంధనల మేరకు అర్హులైన లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి పోడుభూముల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం బీఆర్కే భవన్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించి తీర్మాన ప్రతులను డివిజన్, జిల్లాస్థాయి కమిటీలకు వెంటనే పంపాలని, పోడుభూములపై వచ్చిన వినతుల పరిశీలన, సర్వే పూర్తికి అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 4.14 లక్షల వినతులు వచ్చాయని, వీటిలో అధికశాతం పరిశీలన పూర్తయ్యిందని అన్నారు. పోడుభూముల విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అటవీశాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సీపీఎఫ్ డోబ్రియల్, గిరిజన శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, కార్యదర్శి క్రిస్టినా, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.