మహబూబాబాద్, డిసెంబర్ 7: ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కనీసం వార్డు సభ్యురాలిగా కూడా గెలవదని, ఆమెకు దేశప్రధాని ఫోన్చేసి పరామర్శించడం సిగ్గుచేటని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. మానుకోట మనుషులతోపాటు రాళ్లకూ పౌరుషం ఉన్నదని చెప్పారు. బుధవారం మహబూబాబాద్లోని జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ సమీపంలో నిర్మిస్తున్న నర్సింగ్, మెడికల్ కాలేజీ సముదాయ భవనాన్ని ఎమ్మెల్యే శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, కలెక్టర్ శశాంకతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ పార్టీ వారైనా తిరిగే స్వేచ్ఛ ఉన్నదని, స్థాయికి తగ్గట్టు మాట్లాడితే తప్పు లేదని అన్నారు. లేదంటే ఇక్కడి ప్రజలు ఊరుకోరని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్పై అడ్డగోలుగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోబోదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఎన్ని రోజులు పని చేశామన్నామన్నది కాదు, ప్రజలకు ఎంత మేలు చేశామన్నదే గుర్తు పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు ఏమీ చేయలేదని విమర్శించారు.
మానుకోటలో నిరుపేదలకు పూర్తి స్థాయి వైద్యసేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణలో బీజేపీ విష ప్రచారానికి తెర తీసిందని మండిపడ్డారు. తెలంగాణకు మొదటి శత్రువు వైఎస్ రాజశేఖర్రెడ్డి అయితే తర్వాత ఆయన కొడుకు జగన్, కుమార్తె షర్మిల అని ఆరోపించారు.