హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ములుగు జిల్లాలో ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 889.07 కోట్లతో వర్సిటీని నెలకొల్పనున్నారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు అక్టోబర్లో జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ములుగు సమీపంలో 200 ఎకరాల స్థలాన్ని తెలంగాణ సర్కారు గతంలోనే గుర్తించింది. కేంద్ర ప్రతినిధులు సైతం ఈ స్థలాన్ని పరిశీలించి, యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు. తెలంగాణతో పాటే ఏపీకి సైతం విజయనగరంలో గిరిజన వర్సిటీని మంజూరుచేశారు. ఈ వర్సిటీ 2019లోనే ఏర్పాటు కాగా, తరగతులు సైతం ప్రారంభమయ్యాయి.