హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 10 శాతం గిరిజన రిజర్వేషన్లను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్కార్డు ఉద్యమానికి దిగుతున్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తమ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచి, రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతిని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో గిరిజన విద్యార్థులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు.
కేంద్రం తమను ఓటుబ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటున్నదని మండిపడ్డారు. చేనేత ఉత్పత్తులపై వేసిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీశాఖమంత్రి కేటీఆర్ ఇటీవల లక్ష పోస్ట్కార్డుల ఉద్యమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి విభాగం నిర్ణయించింది. బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి నాయకుడు శ్రీనునాయక్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీకి పోస్ట్కార్డులు పంపే ఉద్యమాన్ని సోమవారం గన్పార్క్ నుంచి ప్రారంభించారు. ఈనెల 15న సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా 1000 మంది గిరిజన విద్యార్థులు మోదీకి పోస్ట్కార్డులు పంపనున్నట్టు వెల్లడించారు. తొలి దశలో పోస్ట్కార్డు ఉద్యమాన్ని చేపడతామని, ఆ తరువాత క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.
మోదీకి తండాల తడాఖా చూపిస్తాం
ప్రధాని మోదీకి గిరిజన విద్యార్థుల తడాఖా ఏంటో చూపిస్తాం. మా జీవితాలు బాగుపడాలని సీఎం కేసీఆర్ మా కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మా తండాల్లో మా రాజ్యం అని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా, ఏ ప్రభుత్వం మా కోరికను మన్నించలేదు. కానీ కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. రిజర్వేషన్లు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా కేం ద్రం రాజ్యాంగ సవరణ చేసే దా కా, విభజన బిల్లులో ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ హామీని నిలబెట్టుకొనే దాకా పోరాడుతాం. రాష్ట్రంలో స్కూల్ మొదలుపెట్టుకొని యూనివర్సిటీ స్థాయి దాకా విద్యార్థులమంతా ఏకమవుతాం.
– శ్రీను నాయక్, తెలుగు వర్సిటీ పరిశోధక విద్యార్థి