సిర్గాపూర్/కల్హేర్/నాగల్గిద్ద, నవంబర్ 23 : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీరుపై సంగారెడ్డి జిల్లా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బహిరంగ సభలో గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ చిత్రపటం అందించేందుకు గిరిజనులు యత్నిస్తుండగా రేవంత్రెడ్డి దురుసుగా వ్యవహరించి జ్ఞాపికను పక్కకు తోసేశారు. తమ ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహరాజ్ను అవమాన పరిచాడని గిరిజనులు గురువారం జిల్లాలోని పలుచోట్ల రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు.
ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్హేర్ మండలం పొమ్యానాయక్ తండా, సిర్గాపూర్ మండలం లక్ష్మణ్నాయక్తండాలో సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగల్గిద్ద మండలంలోని పలు తండాల్లో సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి రేవంత్ తీరును ఖండించారు.