హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): డ్రోన్ల ద్వారా ఔషధాల రవాణా (మెడిసిన్ ఫ్రమ్ స్కై)లో తెలంగాణ మరో వినూత్న ఆవిష్కరణ చేసిం ది. నిర్దేశిత ప్రాంతంలో డ్రోన్ దిగిన తర్వాత ఔషధాలున్న పెట్టెను సొంతంగా వదిలేసి (డిటాచ్).. తిరిగి బేస్కు వెళ్లిపోయే టెక్నాలజీని ‘టీ-వర్క్స్’ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం డ్రోన్ ఒక ప్రాంతానికి వెళ్లాక అక్కడున్న వైద్య సిబ్బంది దానికి అమర్చిన బాక్స్లోని ఔషధాలను తీసుకుంటున్నారు. లేదా మొత్తం బాక్స్ను వేరు చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రోన్లోని సున్నిత పరికరాలు దెబ్బతినే అవకాశం ఉన్నది. లేదా డ్రోన్ దగ్గరికి వెళ్లినప్పుడు వైద్యసిబ్బందికి గాయాలయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. టీ-వర్క్స్ ఆవిష్కరించిన నూతన డ్రోన్ పేలోడ్ టెక్నాలజీలో మానవ ప్రమేయం ఉండదు. హైదరాబాద్కు చెందిన డ్రోన్ కంపెనీ ‘ఎయిర్సర్వ్ ఇనిషియేటివ్’ బుధవారం వికారాబాద్లో ఈ టెక్నాలజీ ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించింది. వికారాబాద్ ఏరియా దవాఖాన నుంచి 6.2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాడ్గుల్చిట్టంపల్లెలోని ప్రాథమిక ఆరో గ్యకేంద్రానికి ఔషధాలను పంపింది. ఔషధ రవాణాలో ఇలాంటి టెక్నాలజీ వాడటం ఇదే తొలిసారని, సెకనులోనే డ్రోన్నుంచి పేలోడ్ విడుదలవుతుందని ఎయిర్సర్వ్వర్గాలు పేర్కొన్నాయి. ఔషధాలకు సంబంధించి కోల్డ్ బాక్స్లను రవాణాచేసి, సొంతంగా జారవిడిచే టెక్నాలజీ కోసం ఎయిర్సర్వ్తో కలిసి పనిచేశామని టీవర్క్స్ సీఈవో సుజయ్ కారంపూడి తెలిపారు.