TRESA | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఇదే సమయంలో భూ సంబంధిత సమస్యలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) కోరింది. సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో ‘రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సదస్సు’ నిర్వహించారు. రెవెన్యూ శాఖకు పునర్వైభవం, రైతులు, ఉద్యోగుల సమస్యల పరిషారంపై చర్చించారు.
ఈ సందర్భంగా వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు తీసుకెళ్లడంలో రెవెన్యూ శాఖదే కీలక బాధ్యత అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ శాఖ పటిష్ఠం అవుతుందని, ప్రజలకు మేలైన సత్వర సేవలు అందిస్తుందని ఆకాంక్షించారు. ఉద్యోగులందరూ కష్టపడి పనిచేయాలని ప్రజలకు సేవలందించి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని కోరారు.
ట్రెసా ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సహాయకులను నియమించి గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరించి భూ రికార్డుల నిర్వహణలో వికేంద్రీకరణ జరగాలన్నారు. పదోన్నతి పొందిన వీఆర్ఏలకు వెంటనే ఎంప్లాయీ ఐడీని కేటాయించి, జీతాలు వ్వాలని కోరారు. కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్లు, ఆర్డీవో, తాసీల్దార్ కార్యాలయాల్లో సిబ్బందిని నియమించాలని కోరారు. వీటితోపాటు అనేక వినతులను ప్రభుత్వానికి వివరించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరామ్.. రెగ్యులరైజ్ అయిన వీఆర్ఏలు, వీఆర్వోలు ఆపరేటర్లు ఎదురొంటున్న సమస్యల పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, మన్నె నర్సింహారెడ్డి, ట్రెసా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పడిగెల రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, దేశ్య, నిరంజన్, శాస్త్రి, నాగమణి, కార్యదర్శులు శైలజ, వాణి, నదీంఖాన్, వెంకటేశ్వర్లు, పల్నాటి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వాణి రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ దేశ్ పాండే, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.